చాయ్ నుంచి చేపల పులుసు దాకా..
స్వీట్లు మొదలు ఐస్క్రీంల వరకు.. అన్నింటి వడ్డన వాటిలోనే
కుండల్లో వంటతో పూర్తి పోషక విలువలు
ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్న ప్రకృతి వైద్య నిపుణులు
హయత్నగర్ రూరల్, నవంబర్ 27 :‘భాయ్.. చార్ చాయ్’.. అని చెప్పి నాలుగు మాటలు మాట్లాడుకోవడం పూర్తికాకుండానే మట్టి కప్పుల్లో గరం గరం చాయ్ వచ్చేస్తున్నది.. పలు రెస్టారెంట్లలో చేపల పులుసు ఆర్డర్ చేయగానే.. అటికెలో తెచ్చి ముందు పెట్టేస్తున్నారు.. తందూరి చాయ్ మొదలు చేపల పులుసు దాకా.. ఐస్ క్రీం నుంచి పలు స్వీట్ల వరకు అన్నింటినీ మట్టి కప్పులు, చిన్న గురిగీల్లో ఇచ్చేస్తున్నారు. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అన్నట్టుగానే మన పెద్దోళ్ల జీవనశైలి వైపు నేటి తరం అడుగులు పడుతున్నాయి. నేడు మట్టి పాత్రల వినియోగం బాగా పెరిగింది. ఇందులో వండిన వంటకాలు రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు సూచిస్తుండడంతో చాలామంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక టీ కొట్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో మట్టి పాత్రల వాడకం ఫ్యాషన్గా మారింది. మట్టి వస్తువులకు ఆదరణ పెరుగడంతో వ్యాపారులు సైతం ప్రజల అభిరుచికి అనుగుణంగా వివిధ డిజైన్లలో అన్ని రకాల మట్టి పాత్రలను అందుబాటులోకి తెస్తున్నారు.
‘ఏం తాత.. తొమ్మిది పదుల వయసొచ్చినా ఇంత హుషారుగా పనిచేస్తున్నవ్.’ అని పట్నంల ఉండే మనుమడు అడిగితే.. ‘అటికెల ఉడికిన అన్నం తింటే ఇట్లనే ఉంటది బిడ్డా..’ అన్నది ఆ తాత సమాధానం. అందుకేనేమో నేటి తరం మళ్లీ ఆ మట్టి కుండల్లో వండుకుని తినేందుకు ఆసక్తి చూపుతున్నది. పాత రోజుల్లోకి అడుగులు వేస్తున్నది. పాత తరం అలవాట్లను అందిపుచ్చుకొనేందుకు ఉవ్విళ్లూరుతున్నది. తాతలు, నానమ్మల్లో ఇప్పటికీ కనిపిస్తున్న గట్టితనమో.. వయసు మళ్లిందనే కారణం తప్ప షుగర్లు, బీపీలనే రోగాలే లేకుండా తిరుగుతున్నారనే విశ్వాసమో కానీ, మళ్లీ వారి బాటలో నడిచేందుకు నేటి తరం సిద్ధమవుతున్నది. అందులో భాగంగానే ‘కుండల్లో వండుకుని తింటే గట్టిగ ఉంటం’ అన్న పెద్దల మాటలను ఆచరణలో పెడుతున్నది. ఇంట్లోనే కాదు.. బయటకెళ్లినా.. చాయ్ మొదలు బిర్యానీ వరకు ఆ మట్టి పాత్రల్లో వండే వాటికే ప్రాధాన్యం ఇస్తున్నది. మట్టి గ్లాసుల్లో చాయ్ తాగడాన్ని ఆస్వాదిస్తున్నది.
వ్యాపారులదీ అదే తోవ
యువత అలవాట్లకు అనుగుణంగానే వ్యాపారులు మారిపోతున్నారు. భోజన ప్రియుల ఆసక్తికి అనుగుణంగా.. చాయ్ కొట్టు నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు చాలా చోట్ల మట్టిపాత్రల్లోనే వండేందుకు, వడ్డించేందుకు పెద్దపీట వేస్తున్నారు. మట్టి గ్లాసుల్లో ఇచ్చే చాయ్ తాగేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని హయత్నగర్లోని ఓ టీ స్టాల్ యజమాని చెబుతున్నారు. అందుకే వాటిలోనే చాయ్ అందిస్తున్నామని పేర్కొంటున్నారు. మరోవైపు, మట్టిపాత్రలకు కూడా డిమాండ్ పెరుగుతున్నది. నేటితరం ఆసక్తికి అనుగుణంగా మట్టిపాత్రలు తయారుచేస్తున్నారు పలువురు వ్యాపారులు. పెద్దఅంబర్పేట్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ పరిధి దాటేవరకు విజయవాడ హైవేపై పదుల సంఖ్యలో చిన్నచిన్న బండ్లు పెట్టుకుని రాజస్థానీవారు మట్టిపాత్రలను విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి తెచ్చి అమ్ముతున్న ఈ పాత్రలకు మంచి గిరాకీ ఉంటుందని చిరు వ్యాపారులు చెబుతున్నారు. ఖరీదు ఎక్కువే అయినా కొనేందుకు వెనుకాడటం లేదని అంటున్నారు. ఒక్కో మట్టి పాత్ర ఖరీదు పరిమాణాన్ని బట్టి రూ.300 మొదలు రూ.600 వరకు ఉంటుందని చెబుతున్నారు. అయినా ఒక్కో అడ్డా వద్ద రోజుకు సగటున 15కు మించే మట్టి పాత్రలను విక్రయిస్తున్నట్టు తెలిపారు. పాత్రల్లో చాయ్ కప్పులు, నీళ్లు తాగే గ్లాసులు, అన్నం వండే అటికెలు, రొట్టెలు చేసే పెంకలు, అన్నం వేడివేడిగా ఉండేలా డిష్లు, నీళ్ల బాటిల్ ఇలా ఎన్నో రకాల మట్టి పాత్రలు విక్రయిస్తున్నట్టు చెప్పారు. మట్టి కుండల్లో వండే భోజనంలో వందశాతం పోషక విలువలు ఉంటాయని, మరే ఇతర పాత్రల్లో వండినా ఇంతస్థాయిలో ఉండవని ప్రకృతి వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా మట్టికుండల్లో వండిన మాంసాహారం చాలా మృదువుగా ఉంటుందని, రుచి కూడా బాగుంటుందని అంటున్నారు. మట్టి కుండల్లో వండే వంటల సువాసన కూడా బాగుంటుందని పేర్కొంటున్నారు.
మట్టి పాత్రల్లో వండిన భోజనం తినడం అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మట్టిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ధాతువులు అధికంగా ఉంటాయి. మట్టి పాత్రల్లో ఆహారం వండితే ఇవన్నీ దీనికి జతవుతాయి. కుండలో ఉండే సహజమైన తేమ.. ఆహారాన్ని సరిగ్గా ఉడికించడానికి సరిపోతుంది. దీనివల్ల నూనె వినియోగం తగ్గుతుంది. గుండె సమస్యలకు దూరం కావొచ్చు. మట్టి కుండలోని నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది. కుండ నీటిలోని మలినాలు పీల్చుకుంటుంది. స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. నిల్వ నీటి వల్ల కూడా సమస్య ఏమీ ఉండదు. మట్టి పాత్రలు పగిలినా అవి మట్టిలో కలిసిపోతాయి. ఇది ప్రకృతికి కూడా మంచే చేస్తుంది. మట్టిలోని చారతత్వం వల్ల ఎసిడిటీ సమస్యలు రావు. ఆహారం త్వరగా పాడవదు. పూర్వీకులు మట్టి పాత్రల్లో వండుకుని తినడం వల్లే కాల్షియం, మెగ్నీషియం లోపాల వల్ల తలెత్తే ఏ సమస్యలు వారి దరిచేరలేదు. ప్రస్తుతం వినియోగిస్తున్న అల్యూమినియం గిన్నెల్లోని టెఫ్లాన్ కోటింగ్ పాత్రల్లో ఆహారం వండటం వల్ల ప్రధానంగా క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.