నిజామాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. సంక్షేమ పథకాలతో ప్రజలకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చుతున్నది. పేద, మధ్య తరగతి వర్గాలపై ఎలాంటి భారం మోపకుండా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నది. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను సైతం కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అనుసరించి మేలైన వేతన సవరణ ప్రకటించి అందరిలోనూ సంతోషం నింపుతోంది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో వివక్షకు గురైన మున్సిపల్, పబ్లిక్ హెల్త్ కార్మికులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థ, పురపాలక సంస్థ పరిధిల్లో పని చేస్తున్న శానిటేషన్, పబ్లిక్ హెల్త్ వర్కర్లకు 30శాతం వేతనాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పెంపుతో కార్మికుల వేతనం నెలకు రూ.4,107 మేర పెరగనున్నది.
జీతాల పెంపు ఈ విధంగా..
ఉమ్మడి రాష్ట్రంలో తక్కువగా ఉన్న వేతనాలను తెలంగాణ ప్రభుత్వం పలు విధాలుగా సవరించింది. 2015 నాటికి శానిటేషన్ కార్మికులకు నెలవారీగా చెల్లించే గౌరవ వేతనం కేవలం రూ.8300 ఉండగా… 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ పెంపుదల నిర్ణయాన్ని అమలు చేశారు. తద్వారా వారి జీతాలు రూ.12వేలకు చేరింది. తాజాగా 30శాతం పెంపు నిర్ణయం మూలంగా కార్మికుల జీతాలు రూ.15,600 చేరుతున్నది. నెలవారీ వేతనాలకు అదనంగా పీఎఫ్ పేరిట రూ.1950, ఈఎస్ఐ చెల్లింపులు రూ.507 కలిపితే మొత్తం గా కార్మికులకు ఒనగూరే లాభం రూ.18,057 ఉంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నెలకు వీరి వేతనాలు రూ.4107 వరకు పెరగనున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా..
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచిన సర్కారు మరోమారు మానవీయతను చాటుకున్నది. ప్రజా ఆరోగ్య రక్షణలో కీలక విధులు నిర్వహించే శానిటేషన్, పబ్లిక్ హెల్త్ కార్మికులకు అందించే గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి మల, మూత్రాలను సైతం ఎత్తడానికి వెనుకడుగు వేయని వారు మున్సిపల్ కార్మికులు. మురికి, చెత్త అపరిశుభ్రత ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించడంతో పాటు కరోనా వైరస్ను అదుపులో ఉంచాలంటే పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పని చేయాల్సి ఉంటుంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు చేశారు.
వారి సేవలకు సలాం..
పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించిన నాయకుడు కేసీఆర్. వారికి అండదండగా నిలిచారు. వారి సేవలను హృదయానికి హత్తుకున్నారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలిచారు. కరోనా విపత్తు సమయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతభత్యాలను పెంచి గౌరవించారు. దవాఖానల్లోనూ పబ్లిక్ హెల్త్ వర్కర్లు ప్రాణాలకు తెగించి పని చేశారు. కరోనా రోగులకు చికిత్స అందించే ప్రాంతాలను క్లీన్ చేయాలంటే వీళ్లు లేకపోతే కష్టతరమైన ప్రక్రియ. పరిశుభ్రత పాటించకపోతే వ్యర్థాలు పేరుకుపోయి వైరస్ మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నటువంటి దుస్థితి. రోగుల సాధకబాధకాలను దగ్గరుండి చూసే వ్యక్తుల్లో వైద్యుల తర్వాత దవాఖానల్లో పబ్లిక్ హెల్త్ వర్కర్లు కీలకం. అమూల్యమైన వీరి సేవలను సీఎం కేసీఆర్ గుర్తించడంతో పాటు జీతాలు పెంచి వారిని సముచితంగా గౌరవించారు. 30శాతం గౌరవ వేతనం పెంపు నిర్ణయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పబ్లిక్ హెల్త్, శానిటేషన్ వర్కర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్సాహంతో పనులు చేస్తున్నాం..
రాష్ట్ర ప్రభుత్వం గతంతో పోలిస్తే రెండుసార్లు వేతనాలు పెంచి మా గౌరవం, ఆర్థిక స్థోమతను పెంచింది. ఇప్పటి వరకు రూ. 12వేలతో పనులు చేశాం. పీఆర్సీ అమలుతో అదనంగా మారో మూడున్నర వేలకు పైగా మాకు వస్తాయి. మేము ఊహించని సమయంలో పీఆర్సీ పెరగడం సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మా ఉద్యోగాలను పర్మి నెంట్ చేస్తారనే ఆశ ఉంది. వేతనాలు పెంచినందుకు సీఎం కేసీఆర్ సార్, ఎమ్మెల్యే షకీల్కు కృతజ్ఞతలు.
-బి. రాజలింగం, మున్సిపల్ జవాన్, బోధన్
మాకు బలాన్నిచ్చాయి..
బోధన్ మున్సిపాలిటీలో 30 ఏండ్ల నుంచి కాంట్రాక్టర్ల వద్ద రోజుకు రూ. 30 కూలి పనిచేస్తున్న. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక మా జీతాలు పెరిగినయి. రెండు రోజుల కింద మాకు మరింత జీతం పెరిగిందని, మా నాయకులు, సార్లు చెప్పిండ్రు. కొంత భారం దిగింది. పనిచేసేందుకు పెంచిన జీతం మాకు మరింత బలాన్ని పెంచింది. తీసుకుంటున్న పైసలకు న్యాయం చేస్తాం.. మా బాధలు గుర్తించి జీతం పెంచిన పెద్దసారు కేసీఆర్కు మా దండాలు.
-చిన్నకోట్ల రేణుక, పారిశుద్ధ్య కార్మికురాలు, బోధన్ మున్సిపాలిటీ
మా భారం తగ్గించింది..
ప్రభుత్వం జీతాలు పెంచి మా కుటుంబ భా రం తగ్గించింది. మాకు జీతాలు పెంచి కేసీఆ ర్ సార్ దేవుడిగా మారాడు. రాబోయే రోజు ల్లో మావంటి చిన్న ఉద్యోగుల బాధలు తీరుతాయని ఆశిస్తున్న. మాలాంటి పేదల ఆశీస్సులు ఆయనపై ఎల్లవేళలా ఉంటాయి. దిక్కులేని కుటుంబాలకు సంక్షేమ పథకాలతో సీఎం సారు అందిస్తున్న సాయం అందరి గుండెల్లో నిలిచిపోతుంది.