మెహిదీపట్నం : ప్రజల శాంతిభద్రతలను కాపాడే క్రమంలో పోలీసులు కరోనా బారిన పడుతుండటంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలంటూ పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. రోజురోజుకు పోలీస్ స్టేషన్లలో సిబ్బందికి కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ఆసిఫ్నగర్ పోలీస్ డివిజన్ పరిధిలోని 5 పోలీస్ స్టేషన్లలో అధికారులు కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.
లంగర్హౌస్, గోల్కొండ, ఆసిఫ్నగర్, హుమాయూన్నగర్, టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు మొత్తం 15 మంది వరకు కరోనా బారిన పడ్డారు.ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లకు వచ్చే వారిని పూర్తి కరోనా నిబంధనలతో అనుమతిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ భవనం మొత్తం శానిటైజేషన్ చేయించడం, సిబ్బందికి అనారోగ్య సూచనలు ఉంటే జాగ్రత్తలు చెప్పి పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం కల్పించడం, పోలీస్ స్టేషన్లోకి వచ్చే వారికి ఉష్ణోగ్రతను పరీక్షించడం, లోపలికి కేవలం ఒక్కరిని మాత్రమే అనుమతించడం, మాస్క్ ధరించిన వారినే అనుమతించడం లాంటి జాగ్రత్తలను ఆయా స్టేషన్ల అధికారులు చేపట్టారు.