ఉస్మానియా యూనివర్సిటీ : నూతన సంవత్సరం సందర్భంగా టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ బోయిళ్ల విద్యాసాగర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. ఏడేళ్లలో కేంద్రప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సవాల్ విసిరారు. దేశంలోని సగటుతో పోలిస్తే తెలంగాణలో పావు వంతే నిరుద్యోగం ఉందని వివరించారు.
అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల నియామకాలను చేపడతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసే ఎత్తని బీజేపీ నాయకులకు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగాలను ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్న ఘన చరిత్ర బీజేపీదని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి, లక్షల మంది ఉద్యోగులను రోడ్డున పడేస్తున్న బీజేపీ నాయకులు ఉపాధి కల్పన గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లంచినట్లు అనిపిస్తోందని అన్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను సైతం టోకుగా అమ్మేస్తూ సామాన్య ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్ష పార్టీల నాయకుల రాజకీయాలకు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగులు బలికావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు ఒగ్గు శివ, కోతి విజయ్, శిగ వెంకట్, కృష్ణ, నవీన్గౌడ్, నరేశ్, జంగయ్య, కొంపల్లి నరేశ్, అరవింద్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.