మియాపూర్: వర్షాకాలంలో ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నాలాల విస్తరణను చేపడుతున్నట్లు, దీనికి తోడు చెరువులను పూర్తి స్థాయిలో సుందకరీకరించి అహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు నుంచి ఎల్లమ్మ చెరువు వరకు రూ. 6 కోట్ల నిధులతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను ప్రాజెక్టు అధికారులతో కలిసి విప్ గాంధీ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో నాలా పనులను వేగవంతం చేయాలని, పనులలో నాణ్యతను పాటించాలని ఆయన సూచించారు. బాటిల్ నెక్ ప్రాంతాలలో ప్రాధాన్యతతో పనులను చేపట్టాలని, లోతట్టు ప్రాంతాలను గుర్తించి పనులను వేగవంతం చేయాలన్నారు. గడచిన కొద్ది సంవత్సరాలుగా ముంపు సమస్య నెలకొంటున్నదని , తమ ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి నాలాలను పూర్తి స్థాయిలో సంస్కరించి ప్రజలను ముంపు సమస్యల నుంచి కాపాడుతున్నదన్నారు.
అధికారులు సమన్వయంతో పని చేసి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విప్ గాంధీ సూచించారు.ప్రాజెక్టు ఈఈ కృష్ణప్ప, డీఈ రాంచందర్, పార్టీ నేతలు శ్రీనివాస్ యాదవ్, సుబ్రమణ్య రెడ్డి, సురేశ్బాబు, భాస్కర్రెడ్డి,బాలమూర్తి, అమర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.