స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకపక్షమే
ఓటర్లలో టీఆర్ఎస్కు భారీ ఆధిక్యం
దరిదాపుల్లో లేని ప్రత్యర్థి పార్టీలు
రేపే నామినేషన్ల ఉపసంహరణ
వరంగల్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం ఖాయమైంది. నామినేషన్ల ఉప సంహరణ రేపటితో ముగియనుంది. ఎన్నిక అనివార్యమైనా.. టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మరోసారి భారీ ఆధిక్యంతో గెలవనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లలో దాదాపు 80 శాతం ఓటర్లు టీఆర్ఎస్ వారే ఉన్నారు. ఈ ఎన్నికల్లో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం పరిషత్, మున్సిపాలిటీ పాలకవర్గాల్లో టీఆర్ఎస్కు సంపూర్థ ఆధిక్యత ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్లలో టీఆర్ఎస్ వారే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు సైతం భారీ ఆధిక్యతతో ఉండనుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గంలో 1032 మంది ఓటర్లు ఉంటారు. అనర్హత, ఎన్నికలు జరగకపోవడం, వివిధ కారణాలతో ఖాళీ అయిన ఎంపీటీసీ, కౌన్సిలర్ స్థానాలు 24 ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో1018 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్కు చెందిన వారు 783 మంది ఉన్నారు. మిగిలిన పార్టీల బలం చాలా తక్కువ ఉంది. కాంగ్రెస్ తరఫున గెలిచిన వారు 175 మంది, బీజేపీ నుంచి గెలిచిన వారు 26మంది, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు మరో 34 మంది ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలతో కాంగ్రెస్, బీజేపీలోని ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇలా ప్రస్తుత ఎన్నికలో టీఆర్ఎస్ బలం 80 శాతం వరకు ఉంది. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తరహాలోనే 90 శాతానికిపైగా ఓటర్లు టీఆర్ఎస్కు మద్దతు తెలిపే పరిస్థితి ఉంది.
అన్నింట్లోనూ టీఆర్ఎస్ హవా..
తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ ఎన్నికలు 2019లో జరిగాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 10 మున్సిపాలిటీలకు 2020లో, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు 2021లో ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 61 మంది జడ్పీటీసీ సభ్యులు, 690 మంది ఎంపీటీసీ సభ్యులు, గ్రేటర్ వరంగల్లో 66 మంది కార్పొరేటర్లు.. ఉమ్మడి జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో కలిపి 212 మంది కౌన్సిలర్లు ఓటర్లుగా ఉన్నారు. వివిధ కారణాలతో ఖాళీ అయినవి మినహాయిస్తే 1018 మందికి ప్రస్తుతం ఓటు హక్కు ఉంది. వీరిలో అత్యధికులు టీఆర్ఎస్ వారే ఉన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోపాటు లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలకు ఎక్స్ అఫీషి యో సభ్యులుగా ఓటు హక్కు ఉంది. ఉమ్మడి జిల్లాలో ఈ ఓటర్లు 14 మంది ఉన్నారు. దాదాపు అందరూ టీఆర్ఎస్ వారే ఉన్నారు.
గతంలో ఘన విజయం..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ బుధవారం ముగిసింది. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆలోపు టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగానే ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనివార్యమైతే డిసెంబరు 10న ఈ ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబరు 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రస్తుత ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. 2019 జూన్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అత్యధిక ఓట్లతో ఘన విజయం సాధించారు. పోలైన ఓట్లలో శ్రీనివాస్రెడ్డికి 827 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 23 ఓట్లు వచ్చాయి. రికార్డు స్థాయి మెజారిటీతో పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విజయం సాధించారు. ఉప ఎన్నిక సమయంలో పాత జిల్లాలు, మండలాలు, మున్సిపాలిటీల ప్రాతిపదికన ఓటర్లు ఉన్నారు. వీటి పునర్విభజనతో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడూ టీఆర్ఎస్కు సంపూర్ణ ఆధిక్యత ఉంది.