సీఎం కేసీఆర్ కృషితో అత్యాధునిక హంగులతో నిర్మాణం
మూడు జిల్లాల ప్రజలకు ఇక్కడ మెరుగైన వైద్యసేవలు
దివంగత ఎమ్మెల్యే రామలింగన్న కోరిక నెరవేరింది
సీడ్ హబ్గా సిద్దిపేట జిల్లా l స్థలాలు ఉన్న వారికి
ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తాం
ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు
దుబ్బాక, సిద్దిపేటలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రి
దుబ్బాక, డిసెంబర్ 25 : సీఎం కేసీఆర్ ఇచ్చిన వరమే.. దుబ్బాక వంద పడకల దవాఖాన అని, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరిక నెరవేరిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ‘దుబ్బాక ప్రాంతమంటే సీఎం కేసీఆర్కు ఎంతో అభిమానం.. ఆ అభిమానంతోనే దుబ్బాకలో వంద పడకల దవాఖాన, కేసీఆర్ బడి, బాలాజీ దేవాలయం, వెయ్యి డబుల్ బెడ్రూం ఇండ్లు.. రామసముద్రం చెరువు కట్ట.. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి’.. అని మంత్రి అన్నారు. శనివారం దుబ్బాకలో రూ.20 కోట్ల తో నిర్మించిన వంద పడకల దవాఖాన భవనాన్ని మం త్రి హరీశ్రావు ప్రారంభించారు. దుబ్బాక మండలం తిమ్మాపూర్లో 30 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. అనంతరం దు బ్బాకలో వంద పడకల దవాఖాన భవనం, ఆర్ఎంపీ భవనం, ఫొటోగ్రాఫర్స్ భవనం, పాల సేకరణ కేంద్రం, లచ్చపేటలో మైనార్టీ దుకాణాల ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. దుబ్బాకలో నిర్మించిన కేసీఆర్ బడిని మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే రఘునందన్రావు పాల్గొన్నారు. అనంతరం దవాఖాన ప్రారంభోత్సవ సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్కు దుబ్బాక అంటే అమితమైన ప్రేమ అని, దుబ్బాక అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తామన్నారు. దుబ్బాక వంద పడకల దవాఖానలో పూర్తిస్థాయి సిబ్బందితో పాటు వైద్య సౌకర్యాలు కల్పించి, దవాఖాన అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే వైద్య సిబ్బంది నియామకాలతో పాటు దవాఖానలో నవజాత శిశువులకు(ఎస్ఎంసీయూ) వైద్య సేవలు, డయాలసిస్ కేంద్రాలు, బ్లడ్బ్యాంక్, ఐసీయూ, ఆక్సిజన్ ప్లాంట్, మార్చురీ గదిని ఆధునీకరించి, అందులో రెండు ఫ్రీజర్లు అందిస్తామని హామీ ఇచ్చారు. దుబ్బాకలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామన్నారు. బస్తీ దవాఖానలు హైదరాబాద్లో తర్వాత సిద్దిపేటలోని కేసీఆర్నగర్లో ఒక్కటి ఉందని, అలాంటి బస్తీ దవాఖానను మెదక్ ఎంపీ ప్రభాకర్రెడ్డి కోరిక మేరకు మంజూరు చేస్తున్నామన్నారు. దుబ్బాక పట్టణాభివృద్ధి కోసం 20 వార్డులకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
టీఆర్ఎస్ సర్కారులోనే దుబ్బాక అభివృద్ధి
టీఆర్ఎస్ సర్కారులోనే దుబ్బాక అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని, 2016లో సీఎం కేసీఆర్ దుబ్బాకకు వచ్చిన సందర్భంగా దివగంత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరిక మేరకు వంద పడకల దవాఖానకు నిధులు మంజూరు చేశారన్నారు. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో దుబ్బాక దవాఖాన భవనాన్ని ఆధునాతనంగా నిర్మించుకుని, ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దుబ్బాకపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉండటంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. దుబ్బాక బస్టాండ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. దుబ్బాక దవాఖానలో పూర్తిస్థాయి సిబ్బందితో పాటు అన్ని వసతులు కల్పించాలని మంత్రి హరీశ్రావుకు ఎంపీ విన్నవించారు. వైద్య సిబ్బందికి క్వార్టర్లు నిర్మించాలని కోరారు. సిద్దిపేట మాదిరిగా దుబ్బాకలో యూజీడీ పనులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, దుబ్బాక మున్సిపల్ అధ్యక్షురాలు వనితారెడ్డి, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.
ఇక సొంత స్థలాల్లోనే ‘డబుల్’ ఇండ్లు
దుబ్బాక టౌన్ : సొంతంగా ఇంటి స్థలాలు ఉన్నవారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని, అందుకు కావాల్సిన విధి విధానాలను ప్రభుత్వం తెలియజేస్తుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. తిమ్మాపూర్లో డబుల్బెడ్ రూం ఇండ్లను ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి, ప్రతి గ్రామంలో అర్హులకు అందజేస్తున్నా రన్నారు. తిమ్మాపూర్లో మరో 25 ఇండ్లను త్వరలోనే నిర్మించి అర్హులైన అబ్థిదారులకు అందజేస్తామన్నారు. గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీ నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు.