మలక్పేట : వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ రూ.3 లక్షలతో కొనుగోలుచేసిన ఆధునిక వినికిడి పరికరాన్ని గురువారం లబ్ధిదారుడైన సిరిసిల్లకు చెందిన బొట్ల కమలాకర్కు ఆయన తన కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆధునిక వినికిడి పరికరాలు బ్లూ టూత్గా ఉపయోగపడతాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వికలాంగుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బొట్ల కమలాకర్ తనకు వినికిడి పరికరాలను మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వాసుదేవరెడ్డి సంక్షేమ భవన్లో వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో కొన్ని జిల్లాల్లో పంపిణీ చేయకుండా ఉన్న పరికరాల గురించి సంస్థ ఎండీ శైలజతో కలిసి జిల్లా డీడబ్ల్యుఓలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఉపకరణాలను ఈ నెల 31 లోపు పంపిణీ చేయాలని ఆదేశించారు.