కామారెడ్డి టౌన్, జనవరి 5: అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నప్పటికీ ఆయా శాఖల అనుమతులు లేక పనులు జరగడంలేదని అసహనం వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో చైర్పర్సన్ దఫేదార్ శోభ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అందజేస్తున్నారని తెలిపారు. భూ వివాదాలను రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూ చించారు. కామారెడ్డి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికీ రోడ్లు, విద్యుత్, అటవీ శాఖ అధికారుల తీరుతో అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టపడి నిధులను తీసుకువస్తే పరిమిత సమయంలో అవి పూర్తి కాకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోతున్నాయని అన్నారు. తిరిగి నిధులు తేవాలంటే ఎంత కష్టమో అధికారులకు తెలియడం లేదని అన్నారు.
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను ఆన్లైన్లో నమోదుచేశామని తెలిపారు. అర్హులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు. జుక్కల్ ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా విద్యుత్ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. 3 ప్రాథమిక పాఠశాలలను యూపీఎస్లుగా, 8 ఉచ్చతర ప్రాథమిక పాఠశాలలను జిల్లా పరిషత్ హైస్కూళ్లుగా మార్చడానికి సభ్యులు ఆమోదం తెలిపారని జడ్పీ సీఈవో సాయాగౌడ్ వెల్లడించారు. బిచ్కుంద, నాగిరెడ్డిపేటలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులను నియమించాలని, లింగంపేట పీహెచ్సీ భవనానికి మరమ్మతులు చేపట్టాలని, ఉపాధిహామీ పథకం కింద పంట పొలాలకు రోడ్లు వేయాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకటమాధవరావు, డీఎఫ్వో నిఖిత, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.