మాదాపూర్ : ట్రేడింగ్ పేరుతో ఓ జంట పలువురు వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడిన సంఘటన గురువారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన పి. సహదేవన్ సబిత (49), పరమేశ్వరన్ రంగనాథన్ (54) దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చి ఉప్పల్లో నివాసం ఉంటున్నారు.
వివిధ రకాల ఉద్యోగాలు చేసిన డబ్బులు సరిపోక పోవడంతో మోసాలకు తెరతీశారు. తాజాగా మాదాపూర్లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తిని ట్రేడింగ్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు అని నమ్మబలికి అతని వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. నాలుగు సంవత్సరాలు గడుస్తున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా పలు కారణాలు చెబుతూ వచ్చారు.
దీంతో అతను మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ నెల 3న ఉప్పల్లో నివాసం ఉంటున్న దంపతులను అదుపులోకి తీసుకుని విచారించగా దంపతులపై సీసీఎస్ హైదరాబాద్లో 3 కేసులు, మారెడ్పల్లిలో 1 కేసు ఉన్నట్లు తెలిసింది. గతంలో పలు స్కీంల పేరుతో ఈ దంపతులు అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసి మోసానికి గురి చేసినట్లు తెలిసింది.
దీంతో మాదాపూర్ పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.