ములుగు, నవంబర్ 12 : అటవీ కళాశాల విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అటవీ శాఖ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలో నిర్వహించిన బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ 2017-21 బ్యాచ్ ద్వితీయ స్నాతకోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కోర్సును పూర్తి చేసుకున్న 48మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. వివిధ రంగాల్లో అత్తున్నత ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు, అధ్యాపకులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ములుగులో నిర్మించిన ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చూస్తుంటే, వరల్డ్ క్లాస్ విద్యాసంస్థలను సందర్శించిన అనుభూతి కలుగుతుందన్నారు. తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ కోర్సు ఏర్పాటు చేశారన్నారు. నాలుగేండ్ల పరిమితితో 2017లో ప్రారంభమైన కోర్సును విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేసుకొని, ద్వితీయ స్నాతకోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మెట్టు పాలెం ఫారెస్ట్ కళాశాల నుంచి అనేక మం ది విద్యార్థులు ఐఎఫ్ఎస్ సర్వీస్ సాధించి దేశవ్యాప్తంగా తమకంటూ ప్రత్యే క గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ములుగు అటవీ కళాశాల విద్యార్థులు కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఫారెస్ట్ కళాశాలలో తెలంగాణలోని అన్ని జిల్లాల విద్యార్థులు ప్రవేశాలు పొందారన్నారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్ శోభ, ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ నీరజాప్రభాకర్, ఉస్మానియా యనివర్సిటీ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, అటవీశాఖ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, కళాశాల డీన్ ప్రియాంక వర్గీస్, డిప్యూటీ డైరెక్టర్లు శ్రీనివాస్, నర్సింహారెడ్డి, అటవీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల ప్రతిభ..
ములుగు అటవీ కళాశాల విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఉన్నత కళాశాలలో స్థానం సంపాదించుకున్నారు. కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు డెహ్రాడూన్లోని పీజీ కళాశాలలో ప్రవేశ ం పొందారు. మల్లేశ్ అనే విద్యార్థి మహారాష్ట్ర యూనివర్సిటీలో పీజీ ఆగ్రో ఫారెస్ట్రీ కోర్సు, రాజు అనే విద్యార్థి 2021 సివిల్ సర్వీసెస్లో అర్హత సాధించాడు. వీరితో పాటు కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఐసీఏఆర్తో గుర్తింపు పొందిన అత్యున్నత కళాశాలలో పీజీలో ప్రవేశం పొందారు.