నిడమనూరు, డిసెంబర్ 22 : నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతల పహాడ్లో మంగళవారం దారుణ హత్యకు గురైన కమతం అచ్చమ్మ(60) మృతదేహం మిర్యాలగూడ దవాఖాన మార్చురీలోనే ఉంది. మంగళవారం బొక్కమంతల పహాడ్లో అల్లుడు కమతం శివనారాయణ కుటుంబాన్ని అంతమొందించే లక్ష్యంతో పథకం ప్రకారం ఆయన మామ జల్లిపల్లి సూర్యనారాయణ కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేయగా అచ్చమ్మ మృతి చెందగా, ఆమె కుమారుడు శివ నారాయణ, భర్త భిక్షమయ్య, తల్లి నారమ్మ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మిర్యాలగూడలోని ప్రైవేట్ దవాఖానలో భిక్షమయ్య, నారమ్మకు చికిత్స అందిస్తుండగా శివనారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహామేరకు మంగళవారం రాత్రి హైదరాబాద్ మలక్పేట యశోద దవాఖానకు తరలించారు. శివనారాయణ తల్లి అచ్చమ్మ మృతి చెందడంతో అమెరికాలో ఉంటున్న ఆయన సోదరి జ్యోతి రాక కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం సాయంత్రం అమెరికా నుంచి బయల్దేరిన జ్యోతి గురువారం ఉదయం చేరుకున్న అనంతరం అంత్య క్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.