మన్సూరాబాద్ : సహారాఎస్టేట్స్ కాలనీలో అస్తవ్యస్తంగా మారిన రోడ్ల నిర్మాణం కోసం రూ. 87.30 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
మన్సూరాబాద్ డివిజన్ సహారా ఎస్టేట్స్ కాలనీవాసుల ఆహ్వానం మేరకు ఆదివారం ఆయన కాలనీలో పర్యటించి గేటెడ్ కమ్యూనిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు త్వరలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షా కాలంలో ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో శుభోదయ కాలనీ, విజయశ్రీకాలనీ, ఆటోనగర్, జడ్జెస్ కాలనీలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు.
సదరు కాలనీల వరదనీటి ముంపును పరిష్కరించేందుకు నూతనంగా వేస్తున్న ట్రంకులైన్ సహారా గేటెడ్ కమ్యూనిటీ నుంచి వేయాల్సి వస్తుందని తెలిపారు. దీనిపై కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. వరద కాలువ విషయంపై సహారా కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో చర్చించానని.. ట్రంకులైన్ నిర్మాణానికి సహకరిస్తే సహారా కాలనీ అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని హామినిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
సహారా కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులకు ఇచ్చిన హామీ మేరకు రూ. 87.30 లక్షలతో కాలనీలో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయించానని ఆయన పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా సహారాఎస్టేట్స్ కాలనీ అభివృద్ధికి సహకరిస్తున్నానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, కాలనీ అధ్యక్షుడు సయ్యద్ జానీ, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మంజుల, సభ్యులు వల్లూరిపల్లి పార్థసారథి, వెంకటాద్రి, కరణం శ్రీకాంత్, మేకల ప్రభాకర్ రెడ్డి, రవిచంద్ర, నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, టంగుటూరి నాగరాజు, బాలరాజు గౌడ్, కంచర్ల రాకేష్రెడ్డి, నర్సింహా గౌడ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.