నాగర్కర్నూల్, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించన్నునట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గస్థాయి ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు పరిష్కారం అయ్యేవరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం తప్పదన్నారు. వానకాలంలో పండిన పంట మొత్తాన్ని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కొనలేదన్నారు. యాసంగి మాట దేవుడెరుగు వానకాలం పంట సంగతేందని ప్రశ్నించారు. తెలంగాణ రైతులను బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రెండు సంవత్సరాల వ్యవధితో వచ్చే ఎలక్షన్ కోసం కుటిల రాజకీయం చేస్తూ మోసానికి పాల్పడుతుందన్నారు. దేశం మొత్తం ఈరోజు తెలంగాణ వైపు చూస్తుందంటే రైతుబంధు వల్లే అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంత్రావు పాల్గొన్నారు.