వెంగళరావునగర్ : ఏడేండ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు.గురువారం వెస్ట్ శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్లో వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ అధ్యక్షతన డివిజన్ నూతన కమిటీని, అనుబంధ కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిన కొత్తలో ప్రతిపక్షాలు వెటకారాలు చేశాయని.. సంక్షేమ పథకాలు అమలు కానేకావని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు.
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఏకంగా లక్ష రూపాయలను పెళ్లి కోసం ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నిధులతో ఎంతోమంది పేదరోగులకు సాయం అందించడం జరిగిందని పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్దిలో కూడా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ చాలా బాగుందన్నారు. భారతదేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని.. మంచి పథకాలు, అభివృద్దితో తెలంగాణ ముందుకు సాగుతుందని అన్నారు.
వెంగళరావునగర్ డివిజన్లో ప్రభుత్వ పాఠశాలలకు నిధులు సమకూర్చడం జరిగిందని..కమ్యూనిటీహాళ్లను చక్కగా నిర్మించుకోవడం జరిగిందని.. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని.. కరోనా కష్టకాలంలో ఉచితంగా వ్యాక్సిన్లు వేసి ప్రజలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు.
కమలాన్ని వీడి.. కారెక్కిన మహిళలు
వెంగళరావునగర్ డివిజన్కు చెందిన మహిళా నాయకురాల్లు, కార్యకర్తలు డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ సమక్షంలో బీజేపీని వీడి..టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ టీఆర్ఎస్ పార్టీ కండువాలను కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరిన మహిళలు మాట్లాడుతూ పనిచేసే కార్యకర్తలకు బీజేపీలో గుర్తింపు లేదన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ చేపడుతున్న అభివృద్ది చూసి టీఆర్ఎస్లో చేరినట్టు పేర్కొన్నారు.