చిన్ననాటి నుంచి పాడి, పంటల మధ్య పెరిగిన జీవితం వారిది. అందుకే ఉన్నత విద్య పూర్తిచేసినా, ఉద్యోగం వైపు వెళ్లకుండా వ్యవసాయంలోకి అడుగు పెట్టారు. అందరిలా వరి, పత్తి వేయకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేస్తున్నారు. ఉత్పత్తులను సైతం మధ్య దళారీ ప్రమేయం లేకుండా నేరుగా అమ్ముకుంటున్నారు. పురాతన వంగడాల విత్తనోత్పత్తి కూడా చేస్తున్నారు. సేంద్రియ సాగు కామన్ పాయింట్గా వారి మధ్య ఏర్పడిన స్నేహ బంధం.. ఆరోగ్యవంతమైన సమాజానికి బాటలు వేస్తున్నది. వందల ఏండ్ల నాటి పంటలను తిరిగి వెలుగులోకి తెస్తున్నది.
ఆలేరు, మోటకొండూరు మండలాలకు చెందిన ఆరుగురు యువ రైతులు సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు.సాగులో మెళకువలు తెలియక.. రసాయన మందులు వాడుతూ నష్టాలను చవిచూస్తున్న రైతుల దుస్థితి ఆ యువకులను కలిచివేసింది. ముందుగా తమ భూముల్లోనే సేంద్రియ పద్ధతులను ఆచరించి సత్ఫలితాన్ని చూపించారు. ఇదే స్ఫూర్తితో చుట్టుపక్కల రైతులను అడుగులు వేయించి అంపశయ్యపై ఉన్న సేద్యానికి కొత్త ఊపిరి ఊదారు. యువకులు చెప్పిన మాటలను ఆచరణలో పెట్టి ఆర్థిక లాభాలను చూసిన రైతులు.. ఒక్కొక్కరిగా సేంద్రియ సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. ఉద్యోగాలు వదిలి వ్యవసాయం చేస్తున్న యువకులను చూసి హేళన చేసిన వారే.. నేడు వేనోళ్లా కొనియాడుతున్నారు.
ఆలేరు పట్టణానికి చెందిన వడ్డేపల్లి సుధీర్ ఎంటెక్ చదివాడు. టంగుటూరు గ్రామానికి చెందిన మరుడోజు శ్రీకాంత్ బీటెక్, దూసరి రాఘవేంద్ర ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), మోటకొండూర్ మండలం దిల్వాపూర్ గ్రామానికి చెందిన పల్లా జితేందర్ బీఈ(ఈసీఈ), వర్టూర్ గ్రామానికి చెందిన గట్టికొప్పుల మశ్చేందర్ ఎంఏ, ఆలేరుకు చెందిన చీరా శ్రీనివాస్ ఇంటర్మీడియట్ చదివారు. కరోనా పరిస్థితుల్లో ఇంటిపట్టునే ఉండి కుటుంబ సభ్యులకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉన్నారు. వీరు చదివిన చదువులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సాగుపై మక్కువతో వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. వీరు ఉండేది పక్కపక్క ఊళ్లలోనే అయినా ఒకరికొకరు పరిచయమే లేదు. సేంద్రియ వ్యవసాయమే వీరందరినీ ఒకచోటకు చేర్చింది. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు సంబంధించిన ఓ గ్రూపులో వీరంతా ఉండడంతో ఒకరి గురించి మరొకరు తెలుసుకుని పరిచయం చేసుకున్నాక స్నేహితులయ్యారు.
కలెక్టరేట్లో సేంద్రియ ఉత్పత్తుల స్టాల్…
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో కలెక్టరేట్లో కొద్దిరోజుల క్రితం సేంద్రియ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటైంది. ఆర్గానిక్ ఉత్పత్తులను ఇక్కడి స్టాల్స్లో ఉంచి అమ్ముకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో చాలామంది రైతులు ప్రతి సోమవారం కలెక్టరేట్కు తాము పండించిన ఉత్పత్తులను తీసుకొచ్చి అమ్ముతున్నారు. కార్యాలయాల పనుల నిమిత్తం వచ్చేవారితో పాటు కలెక్టరేట్ ఉద్యోగులు పండ్లు, కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రతి వారం ఉపాధి కలిగిందని రైతులు సంబురపడుతున్నారు.
సంఘటితంగా సాగుతూ…
సంఘటితంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఈ యువరైతుల బృందం ‘వ్యాపన’ పేరుతో రైతు ఉత్పత్తి సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆరు నెలల కిందట ప్రారంభమైన ఈ సంఘంలో ప్రస్తుతం 50మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఏ పంట సాగు చేయాలి? ఏ విత్తనాలు వేయాలి? వ్యవసాయ అధికారులు ఏం చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ఏం సూచిస్తున్నారు. ఇలా ఒకటేమిటి..! అనేక విషయాలను అవపోసన పట్టారు. నూతన సాగు వివరాలతోపాటు కొత్త పంటల వివరాలను తెలుసుకుని రైతులను ఆ దిశగా చైతన్యపరుస్తున్నారు. ఈ క్రమంలో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ను సద్వినియోగపర్చుకుంటున్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులకు ఆస్కారం లేకుండా.. తమ ప్రాంత రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను, సేంద్రియ ఎరువులను రైతు ఉత్పత్తి సంఘం ద్వారానే అందిస్తున్నారు. తద్వారా రైతులకు రవాణా ఖర్చు ఆదాకావడంతోపాటు, బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే అన్నీ సమకూరుతున్నాయి. చేనుకు ఏదైనా రోగం వచ్చిన సందర్భంలో సత్వర నివారణ చర్యల నిమిత్తం సమాచారాన్ని గ్రూపుల్లో షేర్ చేసుకుని పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నారు. తాము పండించిన పంటలను దళారుల ప్రమేయం లేకుండా స్థానిక సూపర్ మార్కెట్లలో అమ్ముకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఆర్గానిక్ సాగుతో పండించిన పంటలను ప్రతి సోమవారం అమ్ముకునేందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక ఏర్పాట్లు చేయించి రైతులకు కొత్త ఉపాధి చూపించారు.
వందేళ్ల క్రితం నాటి విత్తనాల ఉత్పత్తి…
ఆరుగురు యువ రైతులు ఎవరికి వారుగా తమ సొంత భూముల్లో దేశీయ రకాలకు చెందిన వరి విత్తనాలను పండిస్తున్నారు. అయితే విత్తనోత్పత్తి కోసం ఒక ఎకరంలో అందరూ ఒకేచోట సమష్టి సాగును గతేడాది చేపట్టారు. వందేండ్ల కిందటి పంటల విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టినట్లు వీరు చెబుతున్నారు. వరిలో వెరైటీ రకం రత్నచోడిని శ్రీకృష్ణదేవరాయల కాలంలో సైనికులు తినేవారట. అలాగే కాలబట్టీ, నారాయణ కామిని, మైసూర్ మలిగె, కుజ్జి పటాలియా తదితర రకాలు ఎన్నో ఏండ్ల కిందట సాగు చేసిన పంటలే. కాలబట్టీ క్యాన్సర్ రోగులకు ఇమ్యూనిటీని పెంచుతుందని, మైసూర్ మలిగె చిన్నపిల్లలకు పుష్కలంగా పౌష్టికాహారంగా పనికొస్తుందని ఈ యువ రైతులు చెబుతున్నారు. అలాగే నారాయణ కామిని మోకాలు, నడుము నొప్పుల నివారణకు, రత్నచోడి ఫిట్నెస్కు, కుజ్జి పటాలియా రక్త ప్రసరణ మెరుగుకు దోహదపడతాయని చెబుతున్నారు. వెరైటీని బట్టి కిలో విత్తనాలను రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
భావితరాల కోసమే..
సేంద్రియ సాగులో ఇప్పటికిప్పుడే లాభాలు వస్తాయని అనుకోవడం లేదు. కానీ, ఈ ఉత్పత్తులకు భవిష్యత్తు ఉందన్న నమ్మకంతో ఈ దిశగా అడుగులు వేస్తున్నాం. ఎంటెక్ చేసినప్పటికీ వ్యవసాయంపై ఆసక్తితోనే ఈ వృత్తిలోకి దిగాను. అందరిలా వరి అనగానే.. దొడ్డు, సన్న రకం కాకుండా నారాయణ కామిని, మైసూర్ మలిగె, తెలంగాణ సోనా రకాలను పండిస్తున్నా. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కొంతమేర ఉలువలు కూడా సాగు చేశాను. క్రిమిసంహారక మందులు వాడితే దిగుబడి ఎక్కువగా రావొచ్చు. కానీ, వాటిని తినడం వల్ల ఆరోగ్యం చెడిపోతున్నది. అలాంటి వరి గడ్డి మేసిన పశువుల ద్వారా వచ్చే పాలు కూడా కల్తీ అవుతున్నాయి. అందుకే భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని సేంద్రియ సాగును చేపట్టాం. నా ప్రయత్నానికి ఇప్పుడిప్పుడే ఇతర రైతుల నుంచి స్పందన వస్తున్నది.
డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలి…
బీటెక్ చదివి వ్యవసాయం చేస్తుంటే చాలామంది నవ్వుకున్నరు. సేంద్రియ పద్ధతుల్లో వస్తున్న ఫలితాలను చూసి మమ్మల్ని అభినందించడమే కాకుండా వారు కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని నాకున్న ఐదెకరాల్లో బ్లాక్ రైస్(కల్లబట్టీ), బొప్పాయి సాగు చేస్తున్నా. లాభదాయకంగా ఉంది. చుట్టుపక్కల రైతులకు కూడా వ్యవసాయంలో మెళకువలు చెప్తున్నాం. వ్యవసాయ అధికారులు కూడా మాకు సహకారం అందిస్తున్నారు. దళారులను నమ్ముకోకుండా దగ్గర ప్రాంతాల్లో ఉన్న సూపర్ మార్కెట్లలో మా ఉత్పత్తులను అమ్ముకుంటున్నాం. మూస పద్ధతిలో కాకుండా వినూత్న పంటలను, డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే ఏ రైతుకైనా లాభదాయకమే.
నిత్యం 2వేలు సంపాదిస్తున్నా…
నా కొడుకుతోపాటు వారి స్నేహితులంతా కలిసి సేంద్రియ ఎరువులతోనే పంటలను పండియ్యాలని పట్టుబట్టిర్రు. బొప్పాయిని ఆలాగే పండిస్తున్నాం. వరంగల్ హైవేపై రోజూ అమ్ముతున్నా. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల చాలామంది ఆగి కొనుక్కుంటున్నరు. రోజుకు ఎంతలేదన్నా రెండువేల వరకు ఆదాయం వస్తున్నది.