రంగారెడ్డి, డిసెంబర్ 1, (నమస్తే తెలంగాణ) : ధాన్యం సేకరించాలని కేంద్రంపై తెలంగాణ సర్కార్ చేస్తున్న నిరసన సెగ ఢిల్లీని తాకింది. ధాన్యం కొనాల్సిందేనని మూడు రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభ వేదికగా ఆందోళనలు చేస్తూ కేంద్ర వైఖరిని ఎండగడుతున్నారు. వడ్ల కొనుగోలుపై స్పష్టమైన ప్రకటన చేసేవరకూ నిరసనలు ఆపేదిలేదని ఎంపీలు తేల్చి చెప్పారు. మరోవైపు రైతుల పక్షాన పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనపై ఉమ్మడి జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఆది నుంచి రైతు సంక్షేమానికి పాటుపడింది గులాబీ పార్టీయే అని, లోక్సభలో పార్టీ ఎంపీల పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడుతున్నారు. రైతులకు అండగా ఉంటామని బయట గొప్పలు చెప్పుకునే రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలో మిన్నకుండటంపై జిల్లా ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఢిల్లీలో ఆందోళన చేస్తే తాము కలిసి వస్తామని ప్రకటించిన కాంగ్రెస్కు టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు కనబడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వ్యవసాయ రంగం, అన్నదాతలపై ఏ పార్టీకి చిత్తశుద్ధి ఉందో తెలుస్తున్నదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. లోక్సభ వేదికగా గత మూడు రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రం వైఖరిని ఎండగడుతున్నారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతుల పక్షపాతిగా పేరొందిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. రైతు వ్యతిరేకిగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై టీఆర్ఎస్ ఎంపీలు రంజిత్ రెడ్డితోపాటు సహచర ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, జోగినిపల్లి సంతోశ్కుమార్, సురేశ్రెడ్డి, బండా ప్రకాశ్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పి.రాములు, నేత వెంకటేశ్లు ప్రశ్నించడంతో పాటు రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టతనివ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాదు, రైతు సంక్షేమం కోసం అవసరమైన విధానాలను చేపట్టాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో రైతులకు సమృద్ధిగా సాగునీరు, విత్తనాలు, ఎరువులు, రైతుబంధు, 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత కరెంట్ సరఫరాతో రాష్ట్రంలో దిగుబడులు పెరిగాయని, ఆ మేరకు ఎఫ్సీఐ కొనుగోళ్ల పెంచాల్సి ఉందని పార్లమెంట్లో ప్లకార్డులో ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల సంక్షేమానికై కేంద్ర ప్రభుత్వం విధి, విధానాలను రూపొందించి అమలు చేయాలని, అప్పటి వరకు రైతుల కోసం తమ ఆందోళన, ఉద్యమం కొనసాగుతుందని ఎంపీలు స్పష్టం చేస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల తీరుపై ఆగ్రహం
పరిగి, డిసెంబర్ 1 : రైతన్నలకు అండగా టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో ఆందోళన చేపట్టారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని, రైతులను శిక్షించరాదని ప్లకార్డులు చేత బట్టుకొని ఎంపీలు లోక్సభలో వెల్లోకి దూసుకెళ్లి బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కృషి చేస్తూ వారికి అండగా నిలుస్తుండగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర బిల్లు ప్రవేశపెట్టాలని, తెలంగాణలో రైతులు పండించే వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కేంద్రం కొనుగోలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం నుంచి లోక్సభలో పార్లమెంట్ సభ్యులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి సభను హోరెత్తించారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆందోళన కొనసాగించారు.
రైతులకు అండగా పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనపై రైతాంగం అభినందిస్తున్నది. కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేయడంతో వారి పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రైతులకు అండగా ఉంటామని బయట గప్పాలు కొట్టే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో మిన్నకుండిపోవడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ఢిల్లీలో ఆందోళన చేస్తే తాము కలిసి వస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. తమ కండ్లముందే రైతుల కోసం టీఆర్ఎస్ ఎంపీలు పోరాడుతుంటే కాంగ్రెస్ ఎంపీలకు కండ్లు కనిపించడం లేదా అని రైతాంగం ప్రశ్నిస్తున్నారు. రైతులపై, వ్యవసాయ రంగంపై ఆ పార్టీకి గల చిత్తశుద్ధి తెలుస్తుందని బాహాటంగానే రైతులు పేర్కొంటున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై నానా యాగీ చేస్తూ పార్లమెంట్లో నోరు మూసుకొని కూర్చోవడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తుంటే చూస్తూ కూర్చోవడం కాకుండా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టేలా కేంద్రం ద్వారా ప్రకటన చేయిస్తే రైతులకు మేలు కలుగుతుందని, అలాంటిది పక్కన పెట్టి కేవలం ప్రెస్మీట్లలో మాట్లాడడం సరికాదని రైతులు బీజేపీ ఎంపీలపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు రైతులకు మద్దతుగా పోరాడుతున్న టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి పోరాటం చేస్తే కేంద్రం దిగి వస్తుందని వారు పేర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి..
రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం, దిగుబడులపై కేంద్రం తప్పుడు లెక్కలు చెబుతూ తెలంగాణ రైతులను మోసం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ ఎంపీలు రైతుల పక్షాన పార్లమెంట్ సాక్షిగా తీవ్ర నిరసనలు చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం శుభపరిణామం. ముఖ్యంగా పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణలో ధాన్యం కొనాలని, మద్దతుధరపై చట్టం చేయాలని, అమర కిసాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరడం అభినందనీయం. రైతులకు అండగా ఉంటూ పార్లమెంట్లో గళమెత్తిన టీఆర్ఎస్ ఎంపీలకు ధన్యవాదాలు
-రవీందర్, మెట్లకుంట, బొంరాస్పేట మండలం