మాదాపూర్ : కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం మియాపూర్ డివిజన్ పరిధిలోని నరేన్ గార్డెన్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన కార్పొరేటర్లతో కలిసి పాల్గొని ప్రసంగించారు.
కన్నతల్లిలాంటి పార్టీకి వెన్నుపోటు పొడవకుండా ప్రతిక్షణం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా పార్టీ కాపాడుతుందన్నారు. పార్టీని ప్రారంభించి రెండు దశబ్ధాలు పూర్తి చేసుకున్నామని, అదే ఉత్సాహంతో మరింత ముందుకు సాగుదామని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
దేశంలో ఏ రాష్ట్రంలో సాధ్యం కాని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా పని చేస్తూ ద్విదశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న రీతిలోనే నవంబర్లో వరంగల్లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనుసంధాన కర్తలుగా వ్యవహరించాలన్నారు. ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి సముచితస్థానం ఉంటుందన్నారు.
నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీల సభ్యులు, నాయకులు మీపై నమ్మకంతో ఇచ్యిన పదవులకు న్యాయం చేయాలన్నారు. నవంబర్లో ఏర్పాటు చేయనున్న భారీ మహా సభకు వేలాదిగా తరలిరావాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్గౌడ్, దొడ్ల వెంకటేశ్గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్రెడ్డి, మంజుల రఘునాథరెడ్డి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.