మైలార్దేవ్పల్లి : టీకా వేసుకోవడంలో ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ అసిస్టెంట్ కమీషనర్ సంగిసెట్టి మహేందర్ పేర్కొన్నారు. శుక్రవారం మైలార్ దేవ్ పల్లి డివిజన్ మార్కండేయనగర్ కాలనీలోని బస్తీ దవాఖానలో మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏఈ బల్వంత్ రెడ్డితో కలిసి పరిశీలించారు. వ్యాక్సిన్ కేంద్రానికి టీకా తీసుకోవడం కోసం భారీ ఎత్తున స్థానిక ప్రజలు తరలివచ్చారు.
ఈ సంధర్బంగా మహేందర్ మాట్లాడుతూ..డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో అర్హులైన వారికి వందశాతం వ్యాక్సిన్ వేయాలనే ఉద్ధేశ్యంతో వ్యాక్సిన్ కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 6 వరకు డివిజన్లోని ప్రేమావతి పేట్ , మధుబన్ కాలనీలలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన డాక్టర్ మల్లిక, బస్తీ అధ్యక్షుడు సూర్యనారాయణ, వీడెం రమేష్ ,ఎఎన్ ఎం గ్లోరి తదితరులు పాల్గొన్నారు.