బంజారాహిల్స్ : పర్యావరణ పరిరక్షణ అంటూ సందేశాలు ఇవ్వడం మానేసి ప్రతి ఒక్కరూ కార్యాచరణలో దిగాల్సిన సమయం ఆసన్నమైందని ప్రముఖ హీరో దగ్గుబాటి రానా అన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ, మారుత్ డ్రోన్స్ సంస్థ, సీడ్ కాప్టర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కువద్ద 1.5లక్షల సీడ్ బాల్స్ను డ్రోన్స్ సాయంతో వెదజల్లే కార్యక్రమాన్ని శనివారం హీరో రానా ప్రారంభించాచారు.
డ్రోన్స్లో స్వయంగా సీడ్ బాల్స్ను నింపిన రానా వాటిని కేబీఆర్ పార్కులో డ్రోన్ను ఆపరేట్ చేస్తూ వెదజల్లారు. సీతాఫలం, ఉసిరి,చింత, వెదురు, రావి విత్తనాలను పార్కులో చల్లే కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎంజే.అక్బర్ తెలిపారు. ఈ సందర్భంగా దగ్గుబాటి రానా మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం ప్రభుత్వాలదే అనే అభిప్రాయానికి కాలం చెల్లిందని, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మారిందన్నారు.
అరణ్య సినిమా షూటింగ్లో భాగంగా రెండేళ్లపాటు అడవుల్లో తిరిగే అవకాశం వచ్చిందని, ఆ సందర్భంగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానన్నారు. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన కార్యక్రమాలకు టెక్నాలజీ ద్వారా మరింత చేయూత లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో అడవుల్లో చెలరేగే మంటలను డ్రోన్లతో ఆర్పుతుంటారని, విత్తనాలను చల్లేందుకు ఇక్కడ డ్రోన్లను వినియోగించడం మంచి పరిణామమన్నారు.
సీడ్ బాల్స్ను తయారు చేయడానికి గ్రామీణ ప్రాంతంలోని స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నారని తెలిసినప్పుడు ఎంతో ఆనందం వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకులు ప్రేమ్కుమార్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.