గోల్నాక : దిగువ తరగతుల నుండే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం విప్లవాత్మకమైన చర్య అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు.
బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మేదర సంఘం ఆధ్వర్యంలో అంబర్పేట మేదర సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై.. చదువులో ప్రతిభ కనపరుస్తున్న 50 మంది పేద విద్యార్థులకు ప్రతిభాపారితోషికాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రాథమిక, ఉన్నత దశనుండే ఇంగ్లీష్ మీడియంలో ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం బోధన అందించడం ఒక శుభారంభం అన్నారు. ఉన్నత చదువులకు, ఉన్నతంగా ఎదగడానికి, ఉన్నత ఉపాధి అవకాశాలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎంతో దోహదపడుతోందన్నారు.
ప్రతిభ కొందరికే పరిమితం కాకుండా కష్టపడి కృషి చేసే అందరికీ అందుబాటులోకి రావడం గొప్ప పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేదర సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణతో పాటు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.