మణికొండ : అత్తారింటికి వెళ్లి తిరిగి వస్తూ మద్యంమత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ అదుపుతప్పి పైపులైను గుంతలో పడి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి.
గచ్చిబౌలి అంజయ్యనగర్కు చెందిన సివిల్కాంట్రాక్టర్ మోదాల మల్లేష్ సోమవారం రాత్రి తన ద్విచక్రవాహనంపై రాజేంద్ర నగర్లోని తన అత్తారింటికి వెళ్లి మద్యంసేవించి అక్కడ భార్యతో చిన్నపాటి గొడవపడ్డాడు. అదే కోపంతో తిరిగి ఇంటికి బయలుదేరాడు.
రాత్రి పదిగంటల తర్వాత ఇంటికి తండ్రి వచ్చారా అంటూ భార్య లక్ష్మీ తన కొడుకు మోదాల తారకరాంను పోన్చేసి అడి గింది. అప్పటికీ రాలేదని అతను సమాధానం ఇవ్వడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు మద్యంమత్తులో ఎక్కడైనా పడిపోయాడా అనే అనుమానంతో రాజేంద్రనగర్ నుంచి వెతకడం ప్రారంభించారు. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు.
మంగళవారం తెల్లవారు జామున మల్లేష్ (48) పుప్పాలగూడ ఔటర్ రింగ్రోడ్డు హోండా వర్క్షాప్ ఎదురుగా ఉన్న పైపులైను గుంతలో తన వాహనం అదుపుతప్పి కిందపడిప్రాణాలను కోల్పోయినట్లు స్థానికులు గుర్తించి కుమారుడు తారకరాంకు సమాచారం అందించారు.
ఈ మేరకు మృతుడి కుటుంబసభ్యులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మల్లేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాములు తెలిపారు.