అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న పురాతన డ్రైనేజీ పైప్లైన్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. తన మొదటి ప్రాధాన్యత డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడమేనని చెప్పారు.
గోల్నాక డివిజన్లోని ఖాద్రీబాగ్లో రూ.13లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్లతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖాద్రీబాగ్లో ఉన్న అపార్ట్మెంట్లకు చాలా రోజులుగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.
తన పాదయాత్రలో వారి ఇబ్బందులను గుర్తించి కొత్త డ్రైనేజీ పైప్లైన్ను మంజూరు చేయించానని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే వారి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఇప్పటికే కొత్తగా డ్రైనేజీ పైప్లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు.
రోడ్లు, మంచినీటి పైప్లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్ డీజీఎం సతీష్, మేనేజర్ రోహిత్, జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్, ఏఎంఓహెచ్ జ్యోతి, ఎలక్టికల్ డీఈ వెంకటరమణరెడ్డి, బస్తీవాసులు ఎండీ జహంగీర్, జహీరుద్దీన్, సయ్యద్ సలీం, మోహిన్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.