ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్గోయల్ మాటల్లోని డొల్లతనం మరోసారి తేటతెల్లమైంది. క్షేత్రస్థాయి పరిస్థితులతో పొంతన లేకుండా ఆయన చేస్తున్న ప్రకటనలు రైతుల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ధాన్యం సేకరణలో భాగస్వాములైన అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితుల్లేవని అధికారులు కూడా గుర్తు చేస్తున్నారు. ఎఫ్సీఐ వైఖరి తొలిసారిగా తమను ఆశ్చర్యానికి గురిచేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి ప్రైవేట్ గోదాములు తీసుకుని ఉంటే మిల్లుల్లో ధాన్యం ఖాళీ అయ్యేది.
రైల్వే ర్యాక్ల కేటాయింపులు అవసరానికి తగ్గట్లుగా ఉంటే ఇబ్బందులు ఉండేవి కాదు. సీఎంఆర్ పూర్తయ్యేది. ప్రస్తుత వానకాలం సీజన్ ధాన్యం నిల్వలకు మిల్లుల్లో తగినంత స్థలం దొరికేది. కానీ ఇచ్చిన సీఎంఆర్ తీసుకోమూ… కొత్తగా కొనబోమంటున్న కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ వ్యవహారశైలి తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. అటు రైతాంగంతోపాటు ఇటు ధాన్యం సేకరణలోని అధికారులు, మిల్లర్లను ఇబ్బందుల్లోకి నెడుతున్నది.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : యాసంగి ధాన్యం సేకరణలో ఎఫ్సీఐ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని క్షేత్రస్థాయిలో పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఎఫ్సీఐ గోదాములను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. జిల్లాలో ఎఫ్సీఐ నిత్యం సక్రమంగా బియ్యం సేకరిస్తే 8 వేల టన్నులు అందించగల సామర్థ్యం రైస్మిల్లులకు ఉంది. కానీ 1,500లకు మించి మిల్లులను నడపలేకపోతున్నారు. నల్లగొండ జిల్లాలో యాసంగిలో మొత్తం 8,52,172 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా దాని నుంచి 5,79,476 మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి కానుంది. దీన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా ఎఫ్ఐసీ ద్వారా కేంద్రం సేకరించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 66 శాతంతో 3,80538 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించింది. ఇంకా 1,98,938 మెట్రిక్ టన్నులు తీసుకోవాల్సి ఉంది. ఎఫ్సీఐ ప్రతిరోజూ బియ్యాన్ని సేకరిస్తే వెంటనే సీఎంఆర్ ఇవ్వడానికి జిల్లా అధికారులు సిద్ధ్దంగా ఉన్నారు. కానీ గోదాంలు లేక, రైల్వే వ్యాగన్లు రాక ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోతున్నది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో యాసంగిలో మొత్తం 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించారు. ఇందులో నుంచి 2.89లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి ఎఫ్సీఐకి అప్పజెప్పాలి. దీన్ని అప్పజెప్పేందుకు జిల్లా అధికారులు ఎంత ప్రయత్నించినా ఎఫ్సీఐ నిర్లక్ష్యంతో కనీసం 50 శాతం కూడా పూర్తి కాలేదు. ఇప్పటివరకు 1.41లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే సీఎంఆర్గా ఎఫ్సీఐ సేకరించింది. మరో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవడంలో ఎఫ్సీఐ జాప్యం చేస్తున్నది. సూర్యాపేట జిల్లాలో యాసంగిలో 6.68లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 4.54లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ సీఎంఆర్గా తీసుకోవాల్సి ఉంది. కానీ నేటికి 1.44లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకున్నది. ఇంకా 3.10 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
ప్రైవేట్ గోదాములు తీసుకోవాల్సిందే..
రైస్మిల్లుల నుంచి బియ్యం సేకరించాలంటే వాటిని నిల్వచేసేందుకు ఎఫ్సీఐ వద్ద గోదాములు సరిపడా ఉండాలి. కానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి గోదాముల సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. నల్లగొండ, మిర్యాలగూడల్లోని ఎఫ్సీఐ గోదాములకు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్ధ్యం ఉండగా అవి ఎప్పుడో నిండిపోయాయి. వీటిని ఖాళీ చేస్తేనే కొత్తగా మిల్లుల నుంచి బియ్యాన్ని తీసుకొనే వీలుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్ధ్యం కలిగిన ప్రైవేటు గోదాములన్నీ ఖాళీగా ఉన్నాయి. గతంలో అవసరాలకు అనుగుణంగా వీటిని ఎఫ్సీఐ లీజుకు తీసుకుని వాడుకునేది. కానీ ఈ సీజన్లో అలా జరగలేదు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ- మార్కెటింగ్ విధానంలో గోదాములను లీజుకు తీసుకునే విధానంలో అనేక వీలు కాని షరతులు విధించింది. దీంతో గోదాముల యజమాన్యాలు లీజుకిచ్చేందుకు విముఖత చూపుతున్నారు. దీన్ని సరిచేసే ప్రయత్నాలు మాత్రం ఎఫ్సీఐ నుంచి జరగడం లేదు. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆందోళనలతో ఎఫ్సీఐలో కొంతమేర కదలిక వచ్చింది. తాజాగా మాడ్గులపల్లి మండలం కొత్తగూడెంలో 10వేల సామర్థ్ధ్యం, మిర్యాలగూడెం మండలం వీటిపాలెం వద్ద 13 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్ధ్యం కలిగిన ప్రైవేటు గోదాములను తీసుకున్నట్లు తెలిసింది. మరో రెండు గోదాములను తీసుకోవాలని ఎఫ్సీఐ నల్లగొండ డీఎం ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. ఇదే పనిని సీజన్ ఆరంభంలో చేస్తే రైతులకు ఇబ్బందులు తప్పేవి. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోనూ ప్రైవేటు గోదాములు తీసుకోక, ఎఫ్సీఐ గోదాములు సరిపోక ఇబ్బందులు నెలకొన్నాయి.
రైల్వే వ్యాగన్స్పై పట్టింపేది?
నల్లగొండ జిల్లాలో ఉత్పత్తి అవుతున్న బియ్యాన్ని ఎఫ్సీఐ సేకరించాలంటే నెలకు కనీసం 40 రైల్వే వ్యాగన్స్ అవసరం ఉంటాయి. ఒక్క వ్యాగన్లో 2,500 టన్నుల వరకు బియ్యం రవాణాకు అవకాశముంది. ప్రస్తుతం నెలకు కేవలం 15 వ్యాగన్లు మాత్రమే జిల్లాకు వస్తున్నాయి. యాదాద్రి జిల్లాకు నెలకు 18 వ్యాగన్లు అవసరం ఉండగా గత నెలలో 4, ఈ నెలలో 7 మాత్రమే వచ్చాయి. సూర్యాపేటలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. దీంతో ఎఫ్సీఐ గోదాముల్లో బియ్యం పేరుకుపోయాయి. ఎప్పటికప్పుడూ ఎగుమతులు కాక మిల్లుల నుంచి రావాల్సిన బియ్యానికి ఆటంకంగా మారుతుంది. ఇక ఎఫ్సీఐ గోదాముల్లోని బియ్యాన్ని తరలించాలంటే ఇతర రాష్ర్టాల నుంచి త్వరితగతిన ఇండెంట్లు వచ్చేలా ఎఫ్సీఐ డీఎం నిత్యం పర్యవేక్షణ చేయాలి. అయితే దీనికి కూడా రైల్వే వ్యాగన్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారుతున్నది. రైల్వే వ్యాగన్లను వెంటవెంటనే ఎఫ్సీఐ రప్పించగలిగితే గోదాముల్లోని బియ్యం ఎగుమతి అవుతాయి. దాంతో మిల్లుల నుంచి కొత్తగా సీఎంఆర్ బియ్యాన్ని సేకరించడానికి వీలుంటుంది. అడుగడుగునా ఇలా కొర్రీలతో ఎఫ్సీఐ వ్యవహారం బియ్యం సరఫరాకు తీవ్ర ఆటంకంగా మారింది. ఎఫ్సీఐ నిర్లక్ష్యాన్నంతటినీ రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేందుకు కేంద్రం యత్నిస్తున్నది. ఇన్ని అడ్డంకులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే బియ్యం ఇవ్వట్లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనడం ఎంత అవాస్తవమో స్పష్టం అవుతున్నది.
యాసంగి ధాన్యం కొనకపోతే పరిస్థితి ఎట్లా..
మా భూమిలో వరి తప్ప వేరే పంట పండదు. యాసంగిలో వరే వేయాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనకపోతే మా పరిస్థితి ఎట్ల.. వానకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనడంతో ఇబ్బంది తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేస్తే మంచిది. లేకపోతే రైతులం బుద్ధి చెబుతాం.
కేంద్రం ధాన్యం కొననంటూ నాటకాలాడుతున్నది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనకుండా నాటకాలాడుతున్నది. ఏండ్లుగా వానకాలంలో సన్నాలు, యాసంగిలో దొడ్డు రకం పండిస్తున్నాం. ఇప్పడు దొడ్డు వడ్లు కేంద్రం కొనమంటే ఎటుపోయేది. కేసీఆర్ సార్ ప్రభుత్వం వచ్చినంక రైతులకు అన్నివిధాలా న్యాయం జరిగింది.
మోదీ.. మాపై ఎందుకీ పగ?
నేను నాగలి పట్టిన కాన్నుంచి దొడ్డు రకం వడ్లే పండిస్తున్న. యాసంగిలో సన్నొడ్లు వేస్తే పెట్టుబడి కూడా ఎల్లదు. ఇప్పుడేదో బాయిల్డ్ రైస్ వద్దని మోదీ ప్రభుత్వం తిరకాసు పెడుతుంది గానీ ఇన్నేండ్లు కొన్నోళ్లు ఇప్పుడెందుకు కొనరు? ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన నిలబడి వడ్లు కొనేందుకు తాపత్రయ పడుతుంటే కేంద్రమెందుకు మోకాలడ్డుతున్నది? రైతులు పండించిన పంటను ధైర్యంగా అమ్ముకోలేకుండా ఏందీ పంచాయితీ? దొడ్డు రకాలు దేవుడెరుగు! సన్నొడ్లయినా ఎయ్యాల్నా, వద్దా అని శానా మంది ఆలోచనలో పడ్డరు.