మియాపూర్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నియోజవకర్గంలోని ప్రజలంతా అప్రమత్తవంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కోరారు. వాతావరణ శాఖ వర్షాలపై తగు సూచనలు జారీ చేసినందున అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఈ మేరకు విప్ సోమవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి , జీహెచ్ఎంసీ అదికారుల దృష్టికి తీసుకురావాలని విప్ గాంధీ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నాయని నీటి ప్రవాహానికి ఆటంకాల్లేకుండా చూస్తున్నట్లు తెలిపారు.
ప్రధానంగా లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, ముంపు సమస్యలు పునరావృతం కాకుండా అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులకు సూచించినట్లు విప్ గాంధీ పేర్కొన్నారు. అధికారుల కృషికి తోడు స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం అందుబాటులో ఉండి ప్రజలకు సమస్యలు రాకుండా చూడాలని విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు.