ఎల్బీనగర్ : సుందర హంగులతో, పర్యావరణ హితంగా శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్లోని భూపేశ్గుప్తానగర్ శ్మశాన వాటికలో అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకప్పుడు శ్మశాన వాటికలంటే ముళ్లపొదలు, కంప చెట్లతో నిండిపోయి ఉండేవని, తెలంగాణ ఏర్పాటయ్యాక ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. భూపేశ్గుప్తానగర్ శ్మశాన వాటికను రూ.1.92 కోట్లతో సుందరంగా చేస్తున్నామని, ఆ పనులు నిర్మాణ దశలో ఉన్నాయని అన్నారు.
శ్మశాన వాటికలో బర్నింగ్ యార్డు, పచ్చికబయళ్లు, మూత్రశాలలు, మూడు దహన వాటికలు, కూర్చోవడానికి బల్లలు, బ్రాహ్మణులకు ప్రత్యేక లాకర్ సదుపాయాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సత్యంచారి, శ్రీనివాస్ యాదవ్, ఉదయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.