కుభీర్, డిసెంబర్ 31 : మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధి కోసం రూ.45 లక్షల సీడీపీ నిధులు మంజూరయ్యాయని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి తెలిపారు. ముథోల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ తూం లక్ష్మీబాయి, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్కు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలోని పార్డి(కే), సాంగ్వి, పార్డి(బీ), రామునాయక్ తండా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఒక్కో గ్రామానికి రూ.2 లక్షల చొప్పున మంజూరైనట్లు తెలిపారు. శివునిలో ఇంటర్నల్ గ్రావెల్ కోసం రూ.2 లక్షలు, హల్దలో ఎస్సీ కమ్యూనిటీ హాలుకు రూ.2లక్షలు, చొండిలోని మసీదు ప్రహరీ నిర్మాణానికి రూ.లక్ష, పార్డి(బీ)లోని కబరస్తాన్కు ఫెన్సింగ్ కోసం రూ. 2లక్షలు, నిగ్వలో బీసీ కమ్యూనిటీ హాలుకు రూ.2లక్షలు, పార్డి(బీ)లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ కోసం రూ.4.5లక్షలు, పల్సిలోని ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, వివిధ మరమ్మతులకు గాను రూ.10లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. అనంతరం సోమేశ్వర్ తండాకు చెందిన మల్లుకా బాయికి మంజూరైన రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమె భర్తకు అందజేశారు. సంబంధిత మంజూరు పత్రాలను మండల నాయకుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కందూర్ సంతోష్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, సంజయ్ చౌహాన్, మెంచు రాములు, దత్తురాం తదితరులు పాల్గొన్నారు.