అంబర్పేట : గోల్నాక డివిజన్ నెహ్రూనగర్లో ఉన్న యూపీహెచ్సీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మోడల్ దవాఖానగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఇక్కడి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ థియేటర్ను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్లు యూపీహెచ్సీలో అందుతున్న సేవలను ఎమ్మెల్యేకు తెలిపారు. ప్రస్తుతం దవాఖానలో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, థైరాయిడ్, మలేరియా పరీక్షలు, గర్బిణీ మహిళలకు అవసరమైన పూర్తి స్థాయి చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా హల్త్ సెంటర్ పరిసరాల్లో పరిశుభ్రత పెంచాలని, డ్రైనేజీ పైప్లైన్ మరమ్మతులు, ఎలక్టిక్ పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని కోరారు.
అలాగే హెల్త్ సెంటర్లో రోజు వారి పేషంట్ల సంఖ్య పెరుగుతుందని, సుమారు రెండు రోజులకు 30 ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, వారానికి సుమారు 50 నార్మల్ డెలివరీ ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు. అవసరమైన స్థలం లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, వీలైనంత తొందరగా ఆపరేషన్లకు అవసరమైన గదులు ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యలతో పాటు దవాఖాన ఆవరణలో అవసరమైన సుందరీకీకరణ పనులను సైతం త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీహెచ్ఓ డాక్టర్ హేమలత, మెడికల్ ఆఫీసర్ డా.మమత, హెచ్.వి.శ్యామల, ఏసీ శ్రీలత, స్టాఫ్ నర్సు శ్వేత, టీఆర్ఎస్ నాయకులు భరత్ముదిరాజ్, యూసుఫ్, షరీప్, సల్మాన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.