ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ మణెమ్మ గల్లీలో డ్రైనేజీ పైపులైన్పై ఏర్పాటు చేసిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు గురువారం తొలగించారు. గత నెలలో పైపులైన్పై ఏర్పాటు చేసిన నిర్మాణాలను అధికారులు తొలగించి డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు చేసేలా మార్గం సుగుమం చేశారు. అయితే ఓ నిర్మాణదారుడు తిరిగి ప్రహారీ నిర్మాణం చేపట్టడంతో స్థానికులు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. జోనల్ కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన టౌన్ప్లానింగ్ ఏసీపీ పావని, సెక్షన్ ఆధికారి రాందాసులు పైపులైన్పై ఉన్న నిర్మాణాన్ని స్వల్పంగా తొలగించారు.
దీంతో ఆగ్రహించిన స్థానికులు డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు చేసేలా పూర్తి స్థాయిలో తొలగించాలని, అప్పటి వరకు తమ గల్లీ నుంచి జేసీబీని వెళ్లనిచ్చేది లేదని రోడ్డుకు అడ్డంగా బైటాయించారు. దీంతో చేసేది ఏమిలేక టౌన్ప్లానింగ్ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. మరోవైపు పైపులైన్పై షెడ్ నిర్మాణం చేపట్టిన వారు కోర్టు స్టే ఉన్నా అధికారులు కూల్చివేశారని, దీనిపై కోర్డులో ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చైన్మెన్లు జగన్, అనిల్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.