బడంగ్పేట : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్, మల్లాపూర్లో నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలను ఎహెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారి కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం కూల్చివేశారు. ఈ నెల 5,6 తేదీల్లో హెచ్ఎండీఏ, ఎన్ఫోర్స్ మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించారు.
అధికారులు గుర్తించిన అక్రమ నిర్మాణాలను కూల్చడానికి హెచ్ఎండీఏ అధికారులు, విజిలెన్స్, ఎన్పోర్స్ మెంట్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీసు బందో బస్తుతో వెల్లడంతో తీవ్ర ఉద్రిక్తత నెల కొన్నది. స్థానిక బీజేపీ కార్పొరేటర్స్ అధికారులను అడ్డుకున్నారు.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని వారు పట్టుబట్టారు. అందరికీ ఒకే న్యాయం ఉండాలని అధికారులతో వాగ్వీవాదానికి దిగారు. బడంగ్పేట ప్రధాన రహాదారులపై ఉన్న బహుళ అంతస్తులను ఎందుకు కూల్చడం లేదని వారు అధికారులను ప్రశ్నించారు.
అధికారులు పక్షపాత దోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. పై అధికారుల ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు. గుర్తించిన అక్రమ నిర్మాణాలను దశల వారిగా కూల్చివేతలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్లానింగ్ అధికారులు దమోదర్ నాయక్, విజిలెన్స్ ఎస్ఐ సంతోష్ రెడ్డి, బడంగ్పేట టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్, హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు తదితరులు ఉన్నారు.