ప్రతి సీజన్లోనూ 2 వేల ఎకరాల్లో సాగు
హైదరాబాద్కు నిత్యం ఇక్కడి నుంచే 17,484 టన్నులు
అటునుంచి ఇతర రాష్ర్టాలకూ ఎగుమతి
ఆసక్తి చూపుతున్న హెరిటేజ్, రిలయన్స్ సంస్థలు
ఇంటిల్లిపాదికీ ఉపాధి.. నెలకు 30వేలకుపైగా ఆదాయం
కూరగాయల సాగుతో రాత మార్చుకున్న బొమ్మలరామారం మండల రైతాంగం
యాదాద్రి భువనగిరి, నవంబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన ప్రాంతమది. అక్కడంతా రెండు, మూడెకరాల్లోపు చిన్న, సన్నకారు రైతులే. ఇంటిల్లిపాదికీ వ్యవసాయమే జీవనాధారం కాగా, ఏండ్ల తరబడి వరి, పత్తి వేసి నిలదొక్కుకోకపోగా ఆర్ధికంగా కుదేలయ్యారు. అలాంటి పరిస్థితుల్లో కూరగాయల సాగువైపు మళ్లడం కలిసొచ్చింది. ఒకరి తర్వాత ఒకరు, ఒక ఊరును నుంచి మరొక ఊరు.. ఇప్పుడు బొమ్మలరామారం మండలమే కూరగాయల సాగుకు కేరాఫ్గా మారింది. గతంలో ఇంట్లో అవసరాలకు సైతం బయట కొనుగోలు చేసిన రైతు కుటుంబాలు.. నేడు ఇతర ప్రాంతాలకు పెద్దఎత్తున ఎగుమతి చేస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్కే నిత్యం 17,484 టన్నులు వెళ్తున్నాయి. రిలయన్స్, హెరిటేజ్ వంటి కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడి సరుకును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కూరగాయల సాగు తమ జీవితాలనే మార్చేసిందని ఇక్కడి రైతులు చెప్తున్నారు. ఆర్ధికంగా ఎదుగడమే గాక కొత్త ఇండ్లు కట్టుకున్నామని, పిల్లలను ఉన్నత చదువులకు పంపించగలుగుతున్నామని నమస్తే తెలంగాణకు వివరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 17 మండలాల పరిధిలో 7వేల ఎకరాల్లో ఆకు కూరలు, కూరగాయలు సాగవుతుండగా.. ఒక్క బొమ్మలరామారం మండలంలోనే 2వేల ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారు. పచ్చిమిర్చి, బీన్స్, వంకాయ, బెండ, గోకరకాయ, టమాట..సొర, కాకర, దొండ, బీర, దోస ఇక్కడి రైతులు ప్రతి సీజన్లోనూ పండిస్తున్నారు. బొమ్మలరామారం, మర్యాల, చౌదరిపల్లి, హాజీపూర్, తిమ్మాపురం వంటి గ్రామాలు ఆకు కూరలు, కూరగాయల సాగుకు పేరెన్నికగన్నాయి. ఉన్న కొద్దిపాటి పావు ఎకరం, అర ఎకరాల్లో పాలకూర, కొత్తిమీర, చుక్కకూర వంటి వాటిని పెంచుతున్నారు. 15 నుంచి 45 రోజులకే పంట చేతికొస్తుంది. ఇలా ఎకరాకు క్వింటాల్ నుంచి రెండు క్వింటాళ్ల వరకు కూరగాయల దిగుబడి వస్తుంది. సీజన్కో పంటను పండించిన రైతులు క్రమక్రమంగా రోజువారీ ఆదాయమొచ్చే ఆకు కూరలు, కూరగాయల సాగుపై దృష్టి పెడుతున్నారు. వీటి సాగు పెరిగాక రైతుల కష్టాలు సైతం గట్టెక్కాయి. సాలుకో పంటను సాగు చేస్తుండడంతో రోజుకో క్వింటాల్ చొప్పున దిగుబడులు వచ్చి ప్రతి రైతు కుటుంబం నెలకు రూ.30వేలకు పైగానే ఆదాయాన్ని పొందుతున్నది. శాస్త్రీయ విధానం, నూతన యాజమాన్య పద్ధతులతోపాటు డ్రిప్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు.
నిత్యం 17,484 టన్నుల ఎగుమతులు
ప్రతి రోజూ రాత్రి 1 గంటకు ఆటోలలో రైతులు కూరగాయలను ఈసీఐఎల్, కుషాయిగూడ, బోయిన్పల్లి మార్కెట్లకు 17,484 టన్నుల కూరగాయలను ఇక్కడి నుంచి తరలిస్తారు. వంటిమామిడి మార్కెట్కు ఎక్కువగా కాకర కాయ తీసుకెళ్తారు. ఆ కాయ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు ఎగుమతి అవుతుంది. మార్కెటింగ్ కోసమే రైతులు కార్లను కొనుక్కోవడంతో చాలామంది రైతుల ఇంటి ముందు కార్లు కన్పిస్తాయి. కూరగాయల సాగు లాభదాయకంగా ఉండడంతో యువత సైతం ఉద్యోగాలను వదులుకుని కూరగాయల సాగు బాట పట్టారు. నాణ్యతగల ఇక్కడి కూరగాయలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్, హెరిటేజ్ వంటి సంస్థలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ప్రభుత్వం పందిరి సాగుకు రాయితీలు కల్పించడం కూడా కూరగాయల సాగుకు ఉపకరించింది. రైతులు పండించిన కూరగాయలు, ఆకు కూరలను కొనుగోలు చేసి వారాంతపు సంతల్లో అమ్ముకోవడం వల్ల స్థానిక గిరిజనులు సైతం ఉపాధి పొందుతున్నారు.
ఉద్యోగంతోపాటు కూరగాయల సాగు
వరి, పత్తి వంటి ఇతర ఏ వాణిజ్య పంట అయినా పెట్టుబడులు ఎక్కువ. తీరా.. పంట చేతికొచ్చేదాకా నమ్మకం ఉండదు. జరిగే నష్టం కూడా ఎక్కువే. కూరగాయలైతే పెట్టుబడి తక్కువ. వెంటనే ఆదాయం వస్తుంది. ఒక ఎకరం కౌలుకు తీసుకుని బెండ, బీర్నీస్, మిర్చి, గోకరకాయ వంటి కూరగాయలను సాగు చేస్తున్నా. ప్రైవేటుగా జాబ్ చేస్తున్నప్పటికీ మక్కువతోనే కూరగాయలు పండిస్తున్న.
-చీర్ల రాజు,, రైతు, కుషాయిగూడ, బొమ్మలరామారం మండలం
మార్కెట్లో మంచి డిమాండ్
ఎకరం 20 గుంటల భూమిలో చిక్కుడు, బీర్నీస్, టమాట, వంకాయ పండిస్తున్నా. ఎకరంలో వరి పోను మిగతా అంతా ఆకు కూరలను సాగు చేస్తున్నా. రెండు, మూడు రోజులకోసారి మార్కెట్కు వెళ్లి అమ్ముకుంటున్నాం. మార్కెట్లలో మా కూరగా యలకు మంచి డిమాండ్ ఉంటది.
ఒక్క చిక్కుడు అమ్మకం ద్వారానే సీజన్కు పెట్టుబడులు పోను రూ.లక్ష వరకు
ఆదాయం వస్తుంది.
దుర్గపతి లక్ష్మయ్య, రైతు, తిమ్మాపురం