మారేడ్పల్లి : అప్పుల బాధ తట్టుకోలేక దంపతులిద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను తెలిపిన వివరాల ప్రకారం…మేడ్చల్ జల్లా, కాప్రా, నేతాజీనగర్ ప్రాంతానికి చెందిన యాదల కొండయ్య (55), భాగ్యలక్ష్మి (50)భార్యాభర్తలు.
కొండయ్య బొల్లారంలో ఆర్మీ అకౌంట్స్ విభాగంలో క్లర్క్గా పని చేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె కూషాయిగూడ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తుంది. కుమారులు పైవేటు జాబ్ చేస్తున్నారు.
కాగా కొండయ్యకు అప్పులు పెరిగిపోవడం…వచ్చే జీతం కూడ అప్పులకే సరిపోవడంతో…జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరూ సోమవారం రాత్రి ఇంటి నుంచి ద్విచక్రవాహనం పై అమ్ముగూడ కెవలరీ బ్యారక్స్ యార్డు వద్దకు చేరుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
మంగళవారం ఉదయం సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ మార్చూరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.