బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజల అవసరాలకు అనుగుణంగా సకల సౌకర్యాలతో రహ్మత్ నగర్ డివిజన్లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం రహ్మత్నగర్ డివిజన్ పరిధిలోని ఫాతిమానగర్ను అనుకుని ఉన్న క్యారీ ల్యాండ్స్లో రూ.1.45కోట్ల వ్యయంతో చేపట్టిన మల్టీ పర్సస్ ఫంక్షన్ హాల్ నిర్మాణపనులను ఎమ్మెల్యే మాగంటి పరిశీలించారు.
ఇప్పటికే లెవలింగ్ పనులు తుదిదశకు చేరుకున్నాయని, మరో వారంలోగా నిర్మాణపనులు ప్రారంభమవుతాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు అధికంగా నివాసం ఉంటున్న రహ్మత్నగర్, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ. బోరబండ డివిజన్ ప్రజలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని చేపట్టామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు.
ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతాల్లోని పేదలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రహ్మత్నగర్ కార్పొరేటర్ సీఎన్.రెడ్డి, జీహెచ్ఎంసీ ఈఈ రాజ్కుమార్, ఏఈ జమీల్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.