బన్సీలాల్పేట్ : అనేక ఏండ్ల నుండి మున్సిపల్ క్వార్టర్లలో నివసిస్తున్న వారి ఇండ్లు సొంతం కావాలని ఎదురుచూస్తున్న అనేకమంది కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
నగరంలో మున్సిపల్ క్వార్టర్లలో నివసిస్తున్న కుటుంబాలకు వారి ఇండ్లను వారికే క్రమబద్దీకరణ చేయాలని సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
దీంతో బుధవారం బన్సీలాల్పేట్ డివిజన్లోని న్యూబోయి గూడ, బీజేఅర్ నగర్, హైదర్బస్తీ, పాతబస్తికి చెందిన ఆజంపురా, సుల్తాన్షాహి ప్రాంతాలలో మున్సిపల్ క్వార్టర్లలో నివసిస్తున్న లబ్ధిదారులు, రాంగోపాల్పేట్ డివిజన్లోని జీరా కాలనీలో లీజు స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్న లబ్ధిదారులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ను కలిసి శాలువాతో సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు.
అలాగే సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి తలసానిలకు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తమ ఇండ్లను క్రమబద్దీకరించాలని అనేకమార్లు కోరినా గత ప్రభుత్వాలు ఈ సమస్యను పట్టించుకోలేదని, పేదల బాధలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో నామ మాత్రపు ధరకే లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతించారని తెలిపారు.
నగరంలోని తొమ్మిది ప్రాంతాలలో నిర్మించిన మున్సిపల్ క్వార్టర్లను క్రమబద్దీకరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత, రాంగోపాల్పేట్ మాజీ కార్పొరేటర్ ఎ.అరుణ, వివిధ కాలనీల నాయకులు ఎంఎ.రజాక్, అబ్బాస్, సాయి, మోహన్, జనార్థన్, రాజు, చంద్రశేఖర్, విజయ్, రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.