సికింద్రాబాద్ : కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు ప్రారంభించిందని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో మాదిరిగానే పూర్తిస్థాయిలో త్వరలోనే ఉచితంగా తాగునీటిని అందించేందుకు ఇప్పటికే పలు దఫాలుగా సర్కారు నివేదికలు తెప్పించుకోవడం జరిగిందన్నారు.
ఈ క్రమంలో శుక్రవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ ఉచిత తాగునీటి పథకాన్ని కంటోన్మెంట్లో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉందన్నారు. కంటోన్మెంట్లో పేద, మధ్య తరగతి ప్రజలే కాకుండా అన్ని వర్గాలకు మేలు జరిగేలా 20వేల లీటర్ల ఉచిత తాగునీటిని వర్తింపజేయనున్నట్లు తెలిపారు.
దీనికి సంబంధించి ఇప్పటికే కంటోన్మెంట్లోని ప్రజలకు లబ్ధి చేకూరే ఈ పథకం విధి విధానాల రూపకల్పనపై వచ్చే నెల 2న కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, బోర్డు సీఈఓ అజిత్రెడ్డితో మాట్లాడటం జరిగిందని, ఈ భేటీలో జలమండలి అధికారులు, బోర్డు అధికారులు, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు పాల్గొని సమగ్ర నివేదిక తయారుచేసే విధంగా ముందుకు సాగుతున్నామన్నారు.
ఉచిత నీటి సరఫరాతో ప్రభుత్వంపై పడే సుమారు రూ.1.5కోట్ల భారం సైతం భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఉచిత మంచి నీటి సరఫరాకు సంబంధించిన తదితర అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక చేరిన అనంతరం కంటోన్మెంట్కు ఉచిత తాగునీటి సరఫరాపై ప్రకటించనున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు.