కల్తీ పదార్థాలతో అనారోగ్యాలపాలవుతున్న ప్రజలుఆహార కల్తీ నిరోధక శాఖ తనిఖీలో పలు వాస్తవాలు వెలుగులోకి..ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 101 కేసులు నమోదుఅప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులుపాలు, టీపొడి, నూనె, కారం, పసుపు, బియ్యం, పప్పులు ఇలా ప్రతి నిత్యావసర వస్తువూ కల్తీ అవుతున్నది. తినే ఆహార పదార్థాలూ అలాగే తయారవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగాఆకర్షణీయమైన రంగులు, ప్యాకింగ్లతో కొందరు జనాన్ని మోసం చేస్తున్నారు. పలు రకాల రసాయనాలు నింపి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. మనుషులతోపాటు మూగజీవాల ప్రాణాలనూ లెక్కచేయడం లేదు. కిరాణా దుకాణాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ ఎక్కడ చూసినా వీటి డొల్లతనం కనిపిస్తున్నది. ఇటీవల ఆహార కల్తీ నిరోధకశాఖ తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల నిఘాలోనూ కల్తీ గుట్టు బయపడింది. ఏడాది కాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ రకాల ఆహార పదార్థాలు, వస్తువులకు సంబంధించి 524 శాంపిల్స్ సేకరించి పరీక్షించగా కల్తీ జరిగినట్లు గుర్తించారు. 101 కేసులు నమోదు చేశారు. వీటిలో 30 క్రిమినల్ కేసులు నమోదు కాగా మిగతావి నాణ్యతా ప్రమాణాలు పాటించనివి, లేబుళ్లు లేనివి ఉన్నాయి. అయినప్పటికీ అధికారుల కళ్లుగప్పి విషం కక్కే కల్తీ వస్తువుల విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు కల్తీలపై అవగాహన తప్పనిసరంటున్నారు అధికారులు.
‘మెరిసేదంతా బంగారం కాదు’ అన్నట్లు.. ఆకర్షణీయమైన ప్యాకింగ్లో వచ్చే పలు ఆహార ఉత్పత్తులు కూడా కల్తీ అవుతున్నాయి. స్వీట్లు కల్తీ… కారా, బూందీ కల్తీ, టీ పొడి, ఆయిల్.. ఇలా అన్ని ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నారు. చివరకు పశువుల తవుడు, చేపల దాణాను సైతం వదిలిపెట్టడం లేదు. రెస్టారెంట్లు, హోటళ్లలో తినే పదార్థాలు, మాల్స్, దుకాణాల్లో అద్భుతంగా ప్యాక్ చేసిన వస్తువులు సైతం విషపూరితం అవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. కల్తీ ఆహార పదార్థాలు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. ఏడాది వ్యవధిలో వివిధ రకాల ఆహార పదార్థాలు, వస్తువులకు సంబంధించి 524 శాంపిల్స్ సేకరించి పరీక్షించిన అధికారులు 101 కేసులు నమోదు చేశారు. వీటిలో 30 క్రిమినల్ కేసులు నమోదు కాగా మిగిలినవి నాణ్యతా ప్రమాణాలు పాటించనివి, లేబుళ్లు లేనివి ఉన్నాయి. వస్తువులు, ఆహార పదార్థాలు మార్కెట్లోకి వచ్చేలోగా నాణ్యత మారిపోతున్నది. ‘కాదేదీ కల్తీకి అనర్హం’.. అన్నట్లు కల్తీ వస్తువులు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. అసలు వస్తువు అమ్మకానికి వచ్చేలోపే నకిలీ వస్తువు ప్రత్యక్షమవుతున్నది. ముఖ్యంగా ఆహార పదార్థాల్లో జరుగుతున్న కల్తీ వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఆహార పదార్థాల కల్తీని అరికట్టి నాణ్యతను క్రమబద్ధీకరించేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 1954లో ఆహార కల్తీ నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వినియోగదారులకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం, మోసపూరిత వ్యాపార
పద్ధతుల నుంచి కాపాడటం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. అంతేగాకుండా ఆహార పదార్థాల తయారీలో అవసరమైన మార్గదర్శకాలను అమలు చేయించడం లక్ష్యం.
రంగు వేసిన నాన్ వెజ్… మెరిసే పప్పులూ విషమే…
హోటళ్లలో మాంసాహారమైనా, కిరాణా, మాల్స్లో విక్రయించే ఆహార పదార్థాలైనా కల్తీకి అవకాశాలున్నాయి. సాధారణంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తయారయ్యే అహారపదార్థాలు, స్వీట్లు తదితరాల్లో ఫుడ్ కలర్స్ కలుపుతున్నారు. ఏ హోటల్లో చూసినా రంగు కలుపని మాంసం దొరకడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాగే పప్పు దినుసుల విషయానికి వస్తే వివిధ రకాల బ్రాండ్లతో మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. ఎల్లో టార్ట్రాజైన్ రంగుతో పాలిష్ చేయడం వల్ల పప్పు దినుసులు మెరుస్తుంటాయి. అలాకాకుండా పాలిపోయినట్లుగా, తెలుపు రంగులో ఉండే పప్పులు కొనుగోలు చేయడమే ఉత్తమం.
పరిమితికి మించి ఫుడ్ కలర్స్…
చిన్నా, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో ఘాటైన మసాలాలతో పసందైన అహార పదార్థాలు తయారు చేసే సమయంలో రుచితో పాటు ఆకర్షణీయంగా కనిపించేందుకు పలు రకాల ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. వాటిని పరిమితికి మించి ఉపయోగిస్తే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదకర రంగులు కలిపేస్తున్నారు…
కొన్ని రకాల పదార్థాలతో పాటు నూనెను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్యాకింగ్ కాకుండా విడిగా విక్రయించకూడదు. ముఖ్యంగా ఆయిల్, పసుపు, కారం లాంటివి విడి అమ్మకాలు నిషేధం. అలాగే సగ్గుబియ్యంలో ఫైబర్ ఆప్టికల్ రంగును, బేకరీల్లో లభించే రింగుల్లో ఎల్లో కలర్ కలుపుతున్నారు. టీ పొడి కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను టన్నుల కొద్దీ కొనుగోలు చేసి రంగులు కలిపి నకిలీ టీపొడిని తయారు చేస్తున్నారు. ఇలాంటి టీ పొడి మరింత రంగు ఇస్తుంది కానీ, ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు చెప్తున్నారు. పలు సందర్భాల్లో తనిఖీలు చేపట్టి అనుమానిత పదార్థాల నమూనాలను ప్రజారోగ్య ప్రయోగశాలలకు పంపిస్తారు. అక్కడ వాటిని పరీక్షించి కల్తీ ఉన్నట్లు తేలితే 40 రోజుల్లో తెలియజేస్తారు. ఆ తర్వాత జిల్లా స్థాయిలో కల్తీ పదార్థాలను విక్రయించిన వారిపై కేసులు నమోదు చేస్తారు. అయితే కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో అనేక కేసులు వీగిపోతున్నాయని సంబంధిత శాఖ అధికారి ఒకరు తెలిపారు.
అనుమానం వస్తే సమాచారం ఇవ్వాలి
ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే తప్పకుండా బిల్లు తీసుకోవాలి. సదరు బ్రాండ్లపై లేబుల్స్, ఎక్స్పైరీ తేదీ, తయారీదారుడి అడ్రస్ ఉండాలి. అనుమానం వస్తే 9985820544 నంబర్కు సమాచారం ఇవ్వవచ్చు. ఎక్కువగా అహార పదార్థాలు, ఆయిల్, పాల ఉత్పత్తుల్లో కల్తీ జరిగే అవకాశం ఉన్నది. ఏ వస్తువును కొనుగోలు చేసినా దానిపై ఉన్న బ్రాండ్ను తప్పని సరిగా చూసుకోవాలి. తప్పుడు లేబుల్స్ అతికించి అమ్మకాలు జరిపితే వెంటనే సమాచారం ఇవ్వాలి.
ఏడాది వ్యవధిలో సేకరించిన నమూనాలు, కేసుల వివరాలు…
సూర్యాపేట జిల్లాలో 252 నమూనాలు సేకరించి 57 కేసులు
నమోదు చేశారు.
నాణ్యతా లేమి 24
మిస్ బ్రాండ్ 14
క్రిమినల్ కేసులు 19
నల్లగొండ జిల్లాలో 177 నమూనాలు, 29కేసులు
నాణ్యతా లేమి 14
మిస్ బ్రాండ్ 9
క్రిమినల్ కేసులు 6
యాదాద్రి జిల్లాలో 95నమూనాలు, 15కేసులు..
నాణ్యతా లేమి 8
మిస్ బ్రాండ్ 2
క్రిమినల్ కేసులు 5