మియాపూర్ : రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట కొనుగోళ్లలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో రైతులు కన్నీరు పెడుతున్నారని ఇది కేంద్రానికి ఏమాత్రం తగదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రైతులకు అండగా గులాబీ జెండా ఉన్నదని ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దిగిరావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఇందిరా పార్కు వద్ద చేపట్టిన మహాధర్నాలో మంత్రి కేటీఆర్ ,ఎంపి రంజిత్రెడ్డి, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నియోజవకర్గంలోని కార్పొరేటర్లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ గురువారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయాన్ని పండగలా మలుస్తుంటే కేంద్రం మాత్రం రైతులను దగా చేస్తున్నదన్నారు. రైతు వ్యతిరేక చట్టాలతో కేంద్రం ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నదని, వారు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలుకు లేనిపోని కొర్రీలు పెడుతూ రోడ్డున పడేస్తున్నదన్నారు.
దేశానికే అన్నపూర్ణలా తెలంగాణను మలిచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని , ఇలాంటి పరిస్తితులలో కేంద్ర వైఖరి ఏమాత్రం సరికాదని విప్ గాంధీ అన్నారు. వెంటనే కేంద్రం రంగంలోకి దిగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హమీద్పటేల్, రాగం నాగేందర్యాదవ్, జగదీశ్ గౌడ్, దొడ్ల వెంకటేశ్ గౌడ్,జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్రెడ్డి మంజులా రఘునాథ్రెడ్డి, మాధవరం రోజాదేవిరంగారావు తదితరులు ఉన్నారు. అంతకు మునుపు వివేకానందనగర్లోని తన నివాసం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు ప్రజాప్రతినిధులతో కలిసి విప్ గాంధీ ధర్నాకు బయలు దేరి వెళ్లారు.