బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ దీక్షపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కేంద్రం సూచించిన మార్గనిర్దేశకాల ప్రకారం, హైకోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి చెందకుండా నిబంధనలు, ఆంక్షలు అమలవుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంటే.. సర్కార్కు బాసటగా నిలవాల్సిన ప్రతిపక్షాలు రాజకీయానికి దిగాయి. జీవో-317ను వాడుకొని ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాన్ని కమలం పార్టీ నేతలు మొదలుపెట్టారు. అనుమతిలేని బండి దీక్షపై పెదవివిరుస్తున్నారు. 317 జీవోతో డిస్ప్లేస్ అయిన ఉపాధ్యాయులు కొందరే.. అది కూడా ముందే చర్చించి అంగీకరించిందే..
మహబూబ్నగర్, జనవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గనిర్దేశాల ప్రకారమే, హైకోర్టు ఆదేశాలను అనుసరించి..రాష్ట్రంలో కరోనా-ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా నిబంధనలు, ఆంక్షలు అమలవుతున్నాయి. ఇప్పటికే అన్ని జిల్లాల్లో నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. గతంలో కరోనా వ్యాప్తి వల్ల ఏర్పడిన ఇబ్బందులు మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. అయితే క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి బాసటగా నిలిచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమవంతు బాధ్యత వహించాల్సిన ప్రతిపక్షాలు రాజకీయానికి దిగాయి. 317జీవోను రాజకీయానికి వాడుకుని ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒమిక్రాన్ కేసులు పెరగకుండా, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తున్నది. ఇదే సమయంలో 317 జీవోని అడ్డంపెట్టుకుని రాజకీయం చేయాలని ప్రయత్నించిన బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ ఎంపీ కార్యాల యంలో ఎంపీ బండి సంజయ్ చేస్తున్న దీక్షకు అనుమతి లేదని పోలీసు యంత్రాంగం చట్టప్రకారం పనిచేసింది. 317 జీవో వల్ల డిస్ప్లేస్ అయిన ఉపాధ్యాయులు కొంతమంది మాత్రమేనని పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. 317జీవో ప్రతిపాదనను ముందే చర్చించి అంగీకరించిందేనని పేర్కొంటున్నారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ జీవోలో స్థానికత అనే అంశమే లేదని, కేవలం సీనియారిటీ ప్రాతిపదికన మాత్రమే విభజన ప్రక్రియ చేసేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అంశాన్ని సైతం రాజ కీయంగా వాడుకుని బీజేపీ బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నదని పలువురు ఉపాధ్యాయులు వెల్లడించారు. బండి సంజయ్ చేస్తున్న దీక్ష తొండి దీక్షగా పలువురు పేర్కొన్నారు.
317 జీవో ప్రకారమే విభజన ప్రక్రియ..
రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ 317 జివో ప్రకారమే జరుగుతోందని ఉపాధ్యాయ సంఘం నేత తెలిపారు. ఈ జీవో ప్రకారం స్థానికత అనే ప్రాతిపదిక లేదనీ, సీనియారిటీ ప్రకారం గానే విభజన ప్రక్రియ చేపట్టారని అన్నారు. అయితే సీనియారిటీ లిస్ట్ సిద్ధం చేసే సమయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని… వాటిపై అధికారులకు ఫిర్యాదు చేసి సరి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ అంశాన్ని కూడా తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని ఆ నేత వాపోయారు. ప్రభుత్వం తప్పనిసరిగా తమ సమస్యల పరిష్కారం చేపడుతుందని పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు ధీమా వ్యక్తం చేశారు.