బన్సీలాల్పేట్, : రెండోసారి కరోనా వైరస్ బారిన పడి, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయని స్థితిలో వచ్చిన బాదితుడికి గాంధీ దవాఖానా వైద్యులు మెరుగైన వైద్య చికిత్స అందజేయడంతో శనివారం అతడు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యాడు.
లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రైవేట్ దవాఖానాలలో చెప్పారని, తనకు సకాలంలో ఊపిరితిత్తులకు ఆపరేషన్ చేసి పునర్జన్మ ఇచ్చిన గాంధీ వైద్యులు, సిబ్బందికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపిన వివరాల ప్రకారం..
హైదారాబాద్లోని రామంతాపూర్ నివాసి అయిన సురేశ్ కుమార్ (33)కి ఈ ఏడాది కొవిడ్ రెండో దశ ఏప్రిల్లో కరోనా వైరస్ సోకడంతో గాంధీ దవాఖానలో చేరి, 14 రోజుల పాటు చికిత్స తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి దగ్గరలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేసే అతడు జూన్ నెలలో మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డాడు.
ప్రైవేట్ దవాఖానలకు వెళ్ళగా, ఊపిరితిత్తులు పాడైపోయాయని చెప్పి పెద్ద మొత్తంలో వసూలు చేశారు. ఉన్న డబ్బాంతా అయిపోవడంతో పాటు ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరోసారి జూన్ మాసంలో గాంధి దవాఖానలో చేరాడు. ముందుగా అత్యవసర విభాగంలో చేర్చుకుని చికిత్స అందించారు.
అనంతరం పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియా, రేడియాలజీ, ఇతర విభాగాల వైద్యుల బృందం సురేశ్ కుమార్ కేసును సీరియస్గా తీసుకుని, పలు మార్లు వివిధ రకాల పరీక్షలు చేశారు. ఊపిరితిత్తులకు వెళ్ళే నాళాలలో ఇబ్బందులు తలెత్తాయని, శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతున్నదని గుర్తించారు.
వెంటనే సి.టి. సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ రవీందర్, ఇతర వైద్యుల బృందం కలిసి అతడికి ఆపరేషన్ నిర్వహించారు. అది విజయవంతం కావడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొలగిపోయాయి. కొవిడ్ కూడా నియంత్రణలోకి వచ్చింది. అన్ని రకాలుగా కోలుకున్న సురేశ్ కుమార్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని శనివారం డిశ్చార్జి అయ్యాడు.