బొంరాస్పేట, డిసెంబర్ 8: యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని ప్రభుత్వం, వ్యవసాయా ధికారులు స్పష్టం చేయడంతో రైతులు కూడా చైతన్యవంతులై తమ ఆలోచనా ధోరణిని మార్చుకుంటున్నారు. యాసంగిలో పండించే ధాన్యాన్ని కొనబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్ప డంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇతర పంటల సాగువైపు మళ్లించేలా చైతన్యం చేస్తున్నది. వ్యవసాయ బోర్ల కింద ఆరు తడి పంటలను సాగుచేస్తే వచ్చే లాభాలు, వరి సాగుచేస్తే కొనితెచ్చుకునే కష్టాల గురించి వ్యవసాయాధికారులు గ్రామా ల్లో రైతులకు వివరిస్తున్నారు. బొంరాస్పేట మండలంలోని చాలా గ్రామాల్లో రైతులు ఈ ఏడాది వ్యవసాయ బోర్ల కింద ఆరుతడి పంట అయిన బెబ్బెర్లను సాగు చేస్తున్నారు. కొందరు రైతులు పూర్తి పంటగా సాగు చేస్తుండగా, మరి కొందరు వేరు శనగలో అంతర పంటగా బెబ్బెర్లను సాగు చేస్తున్నారు. తుం పర సేద్యం పరికరాల ద్వారా నీరందించి పంటలను సాగు చేస్తున్నారు. ఏటా యాసంగిలో మండలంలో బెబ్బెర పంట సాగు 200 ఎకరాలు మించేది కాదు. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 700 ఎకరాలు దాటింది. వాన కాలంలో సాగు చేసిన పెసర, ఇతర పంటలు దెబ్బతినడంతో రైతులు వేరుశనగ పంటతో పాటు బెబ్బెర్లను కూడా సాగు చేశారు. ప్రస్తుతం వరి కి బదులు ఇతర పంటలను సాగు చేయాలని వ్యవ సాయాధికారులు రైతులను చైతన్యం చేస్తున్న దృష్ట్యా బెబ్బెర సాగు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మండల వ్యవసాయాధికారి రాజేశ్ కుమార్ తెలిపారు.
ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి
ఆరుతడి పంటగా సాగుచేసే బెబ్బెర ఎకరాకు నాలుగు క్విం టాళ్ల దిగుబడి వస్తున్నది. మార్కెట్లో క్వింటాలుకు రూ. 5500ల నుంచి రూ.6 వేల వరకు ఉంది. ఒక ఎకరాలో బెబ్బెరను సాగు చేయడానికి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చవుతుంది. ఖర్చులు పోగా ఎకరాకు రైతుకు రూ.15 వేల వరకు లాభం వస్తున్నది. పంటకాలం వేరుశనగ మాదిరి గా మూడు నెలలు. ఒక ఎకరా వరి పంటను సాగు చేసే నీటితో మూడు ఎకరాలలో ఆరుతడి పంటలను సాగు చేయవచ్చని వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.