ఖైరతాబాద్ : బీసీ కుల గణన చేయకపోతే బీజీపీ బీసీలు ఓట్లెయ్యరని వక్తలు స్పష్టం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్ట్లో ఏర్పాటు చేసిన అఖిల పక్ష కమిటీ సమా వేశానికి ఆ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అధ్యక్షత వహించారు. సమావేశానికి హాజరైన టీఆర్ఎస్ నేతలు ఎల్.రమణ, రాజారాం యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంత రావు, సీపీఐ నేత అజీజ్ పాషా, టీజేఎస్ అధ్య క్షులు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నాయకులు మల్లు రవిలు బీసీ కుల గణన, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్రం తీరును ఎండగట్టారు.
బీసీ కులాల జనాభా లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడం, గ్రామీణాభివృద్ధి, ఇండ్ల, స్వయం ఉపాధి పథకాలకు బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి జస్టిస్ రోహిణి చైర్మన్గా కమిటీ వేశారని, కులాల వారి జనాభా లెక్కలు లేకపోవడంతో ఈ కమిటీ వర్గీకరణ అంశంలో తికమక పడుతున్నదన్నారు.
ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు ఉద్దవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్, స్టాలిన్, హేమంత్ సోరెన్ ప్రభుత్వాలు కులాల వారిగా లెక్కలు తీయాలని అసెంబ్లీలో తీర్మాణాలు చేశారని, దేశంలో వంద శాతం ప్రజలు కులాల వారిగా లెక్కలుచేయాలని కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదన్నారు.
కులాల వారిగా జనాభా లెక్కలు తీయాలని కోర్టులు చెబుతూనే ఉన్నాయని, రిజర్వేషన్లకోసం కేంద్రం నియమించిన రాజ్యాంగబద్దమైన మండల్ కమిషన్, కాకా కాలేల్కర్, రాష్ట్రస్థాయిలో నియమించిన 242 బీసీ కమిషన్లు కూడా కేంద్రానికి సిఫారసుచేసినా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్చేశారు. స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు గడిచినా బీసీలకు నేటికీ రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించలేదన్నారు.
బీసీ జనాభా లెక్కలు సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, అవసరమైతే పార్టీలకు అతీతంగా ఉద్యమాలకు సిద్దం కావాలన్నారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు కోలా జనార్ధన్, లాల్కృష్ణ, గుజ్జ సత్యం, దాసు సురేశ్, ప్రభాకర్, రవీందర్, గణేశ్, ఉదయ, నీలవెంకట, అంజీ తదితరులు పాల్గొన్నారు.