బంజారాహిల్స్ : పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పసుపుపచ్చగా కనిపిస్తుందన్న చందంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆకుపచ్చ రంగుతో కళకళలాడుతున్న తెలంగాణ అభివృద్ది కనిపించడం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 11లోని లేక్వ్యూ ఫంక్షన్ హాల్లో వెంకటేశ్వరకాలనీ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీల సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా మారిందని, ఎటుచూసినా పచ్చని పొలాలు, పంటకాల్వలతో కనువిందు చేస్తుందన్నారు.
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు అడుగడుగునా పచ్చని పొలాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గతంలో బీడుభూములు, బంజరు భూములతో ఎడారిగా కనిపించే తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో ఆకుపచ్చ తెలంగాణగా మారినప్పటికీ బండి సంజయ్ లాంటి పచ్చకామెర్ల రోగులకు మాత్రం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
రైతుల పొట్టగొట్టేలా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంటే బీజేపీ నాయకులు నోరుమెదపడం లేదని, కేంద్ర ప్రభుత్వం ద్వారా 100శాతం వరిధాన్యం కొనిపించే దమ్ము లేదు కానీ రైతులను రెచ్చగొట్టేలా ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం మాత్రం మానుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా రోజూ అబద్దాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని, ఆయన చెప్పే అబద్దాలను ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు .