వస్త్ర వ్యాపారంపై జీఎస్టీని పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఐదు శాతం నుంచి పన్నెండు శాతానికి జీఎస్టీని పెంచి, శనివారం నుంచి అమల్లోకి తేవాలని తొలుత కేంద్రం భావించింది. అసలే కరోనా దెబ్బ నుంచి కోలుకోని పరిస్థితుల్లో ఇటీవల తీసుకున్న ఈ నిర్ణయంపై ఇటు వస్త్ర వ్యాపారులు, అటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్వయంగా మంత్రి కేటీఆర్ ఇద్దరు కేంద్ర మంత్రులకు లేఖ రాసి, నేతన్నలపై ఈ భారం సరికాదని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్రం వాయిదా ప్రకటన చేయగా, వస్త్ర వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ టౌన్, డిసెంబర్ 31 : కేంద్ర ప్రభు త్వం జనవరి 1, 2022 నుంచి వస్త్ర వ్యాపారంపై జీఎస్టీని 12 శాతానికి పెంచాలనే నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప లు రాష్ర్టాలు ఒత్తిడి తేవడంతో శుక్రవారం కేంద్రం వెనక్కి తగ్గింది. అసలే కరోనా కా లంలో వ్యాపారం సరిగా లేక ఆందోళన చెందుతున్న చేనేత, వస్ర్తాలపై 5 శాతం ఉన్న జీఎస్టీని 7 శాతానికి పెంచి 12 శాతంగా అ మలు చేస్తున్నట్లు కేంద్ర జౌళీశాఖ ప్రకటించడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వస్త్ర వ్యాపారులు ఆందోళన చెందారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూతనందించి బతుకమ్మ చీరలతో పాటు ప్రతినెలా రూ. 2,016, వస్ర్తాల తయారీకి ఉపయోగించే పరిశ్రమపై రుణ రాయితీలు అమలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం పన్ను విధించడంపై మంత్రి కేటీఆర్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖను కూడా రాశారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం జీఎస్టీ మండలి ఢిల్లీలో ఆర్థిక మండలి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించగా.. పలు రాష్ర్టాల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు జీఎస్టీ పన్నును తాత్కాలికంగా వా యిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో వస్త్ర వ్యా పారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో 40 షాపింగ్ మా ల్స్తో పాటు 2 వేల హోల్సేల్ షాపులు, మరో 5 వేల రిటైల్ వ్యాపారులు వస్త్ర వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించింది..
కేంద్ర ప్రభుత్వం వస్త్ర వ్యాపారంపై 5 శాతం ఉన్న జీఎస్టీ పన్నును 7శాతానికి పెంచి 12 శాతంగా జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయించడంతో మంత్రి కేటీఆర్ తక్షణం స్పం దించారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటే కేంద్రం పన్ను విధించడంపై స్వయంగా కేంద్రానికి లేఖ రాయడం వల్లనే జీఎస్టీ పన్నుపై అన్ని రాష్ర్టాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో వస్త్ర వ్యాపారులకు కొంత ఊరటవచ్చినట్లయ్యింది.
-ఎర్రవోతు రేవతి, సోమయ్య క్లాత్ మర్చంట్, నిర్మల్
కేంద్రం జీఎస్టీ పన్ను శాశ్వతంగా ఎత్తివేయాలి..
కేంద్ర ప్రభుత్వం వస్త్ర పరిశ్రమపై విధిస్తున్న జీఎస్టీ పన్నును శాశ్వతంగా ఎత్తివేయాలి. చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది వస్త్ర వ్యాపారం మాత్రమే. 5 శాతం నుంచి 12 శాతానికి పన్ను పెంచడం వల్ల అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులపై భారం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, వస్త్ర వ్యాపారులు ఒత్తిడి వల్లనే కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది.
-గుమిడ్యాల రాజు, జీఆర్బీ షాపింగ్ మాల్, యజమాని