బన్సీలాల్పేట్ : అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, వాటి గురించి తెలుసుకుని లబ్ధిపొందాలని అప్సా స్వచ్చంద సంస్థ కోఆర్డినేటర్ ఎం.బస్వరాజ్ అన్నారు.
అప్సా స్వచ్చంద సంస్థ, కేంద్ర కార్మిక విద్యా మండలి సంయుక్త ఆధ్వర్యంలో భోలక్పూర్లోని ఎవర్గ్రీన్ కమ్యూనిటి హాలులో రెండు రోజులపాటు స్థానిక మహిళలకు అవగాహన శిబిరం నిర్వహించారు. ఇందులో కుటుంబ విలువలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ గురించి ఎం.బస్వరాజ్ వివరించారు.
కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులను తీసుకుని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా లీగల్ సర్విసెస్ అథారిటి, సీనియర్ పారాలీగల్ వలంటిర్ బి.సురేశ్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాలు, సహాయం అందించడానికి, సత్వర న్యాయం పొందడానికి అన్ని కోర్టులలో ఉచిత న్యాయ సహాయ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.
సోషల్ వర్కర్ శ్రీరాములు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ మన అందరి భాధ్యత అని, ఆడపిల్లల కదలికల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, వారిని చదివించి అన్ని రంగాలలో ప్రోత్సాహించాలని అన్నారు.
ఆశ్రిత సంస్థ డైరెక్టర్ ఎస్.నాగరాజ మాట్లాడుతూ పేదరికం కారణంగా పిల్లలను చదువుకు దూరం చేయవద్దని, విద్యాహక్కు చట్టం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పారాలీగల్ వలంటిర్ ఈశ్వరి, అప్సా మొబిలైజర్ ఎన్.శోభలు పాల్గొన్నారు.