ఆత్మకూరు(ఎం) మండలంలోని ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. మండల పరిషత్ అధ్యక్షురాలు మొదలుకొని మండల స్థాయి అధికారులంతా మహిళలే. తాసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుర్వేద వైద్యశాల అధికారులు సమన్వయంతో విధులు, కార్యక్రమాలను తమదైన శైలిలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పాలనలో ఒకరికొకరు హకరించుకుంటూ సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారు.
ఆత్మకూరు(ఎం), డిసెంబర్ 18
ప్రజలకు అందుబాటులో..
ఎంపీపీ పదవి వస్తుందని ఏనాడూ అనుకోలేదు. వచ్చిన పదవిని అదృష్టంగా భావిస్తున్నాం.ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందుబాటులో ఉండి ప్రజా సేవ చేస్తూ గుర్తింపు పొందేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
రైతులకు నిరంతరం అవగాహన…
ఆలేరులోని ఏడీఏ కార్యాలయంలో టెక్నికల్ ఏఓగా పని చేస్తూ ఆత్మకూరు(ఎం) మండల వ్యవసాయ శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తుండడం సంతోషంగా ఉంది. నిరంతరం రైతులతో నేరుగా మాట్లాడడంతో పాటు వారి మధ్యనే ఉంటూ ఎప్పటికప్పడు సలహాలు, సూచనలు అందిస్తున్నాం. పంట మార్పిడితో పాటు ఇతర పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం.
ప్రజాసేవ చేయడంలో ఆనందం..
ఆయుర్వేద వైద్యాధికారిగా ఆత్మకూరు(ఎం)లో 8 ఏండ్లుగా రోగులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నాను. ఆయుర్వేద దవాఖానకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి వృద్ధులు ఎక్కువగా వస్తుంటారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను అవసరమైన వారికి ఎప్పటికప్పుడు అందిస్తున్నాం.
వైద్యాధికారి తొలి ఉద్యోగం ఇక్కడే..
ఎంబీబీఎస్ పూర్తి కాగానే మొదటిసారిగా ఆత్మకూరు(ఎం) మండల వైద్యాధికారిగా విధులు చేపట్టడం ఆనందంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు, గర్భిణులు, బాలింతలను ఆప్యాయంగా పలకరిస్తూ సేవలు అందిస్తుండడం ఎంతో గర్వంగా ఉంది. ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలందరూ పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ఆరోగ్య సిబ్బందితో కలిసి అవగాహన కల్పిస్తున్నాం.
నిజాయితీగా సేవలు అందిస్తున్నాం…
జూనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ తాసీల్దార్గా విధులు నిర్వహించి పదోన్నతిపై తాసీల్దార్గా రావడం సంతోషంగా ఉంది. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయతీగా సేవలు అందిస్తున్నా. కార్యాలయానికి వచ్చే రైతులతో పాటు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటున్నాం.