ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గానికి మంజూరు చేసిన డిగ్రీకళాశాల భవననిర్మాణం కోసం సోమవారం ఉప్పల్ ప్రాంతంలో అధికారులు పర్యటించారు. ఈ మేరకు అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ గన్శ్యాం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అసోసియేషన్ చైర్మన్ డా.ఈ.బ్రిజేష్ కలిసి పరిశీలించారు. ఉప్పల్లోని ప్రభుత్వ పాఠశాల భవనం, చిలుకానగర్లోని ప్రభుత్వ పాఠశాల భవనాలను, మైదానాలను పరిశీలించి, వివరాలు సేకరించారు. ప్రస్తుత సంవత్సరానికి కళాశాలలో అడ్మిషన్లు, క్లాసుల నిర్వాహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కళాశాల ఏర్పాటు చేస్తామని, ఉప్పల్ పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఉపయోగపడేవిధంగా తగిన ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు. డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం రెండోవిడతలో దోస్త్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ప్రవేశాల నేపథ్యంలో భవనం కేటాయింపు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు భవనాలను, విద్యార్థులకు రవాణా సౌకర్యం, తదితర వసతులపై చర్చించారు. పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల సముదాయంలోని భవనాల కేటాయింపులు, వసతులు, తదితర అంశాలపై చర్చించారు.