మియాపూర్ : కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్నా…ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు సంక్షేమాన్ని విజయవంతంగా ముందుకు సాగిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రాబోయే రోజులలోనూ మరిన్ని పథకాలు ప్రజలకు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్, ఆల్విన్ కాలనీ, హైదర్నగర్, కూకట్పల్లి డివిజన్లలో 70 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం కింద మంజూరైన రూ. 70,08,120 చెక్కులను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్ గాంధీ గురువారం తన నివాసంలో పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకంతో పేద యువతుల పెండ్లి తల్లిదండ్రులకు ఏమాత్రం భారం కాబోదన్నారు. పెండ్లి కాంతులతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని విప్ గాంధీ పేర్కొన్నారు.
రెండు సంవత్సరాలుగా కరోనాతో పరిస్థితులన్ని తారుమారయ్యాయని,అయినప్పటికీ ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో వెనకడుగు వేయటం లేదన్నారు. పథకాలను పేదల దరికి చేర్చేందుకు తాను అహర్నిషలు కృషి చేస్తున్నట్లు విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోవర్థన్, ఆర్ఐ శ్రీనివాసరెడ్డి, వీఆర్వో యాదగిరి, పార్టీ నేతలు సంజివరెడ్డి, పెద్ద భాస్కర్, కాశీనాథ్, శ్రీనివాస్, వెంకటేశ్, వాసు తదితరులు పాల్గొన్నారు.