నిర్మల్ అర్బన్, మే 12 : మద్యానికి బానిసైన తండ్రిని చంపిన ఓ కొడుకు ప్రమాదంగా చిత్రీకరించాడు.. అనుమానం వచ్చిన ఓ బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను నిర్మల్ పట్టణ పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ దేశిరెడ్డి ఉపేందర్రెడ్డి వెల్లడించారు. నిర్మల్ పట్టంలోని సోఫీనగర్కు చెందిన మహ్మద్ రషీద్ లారీ మెకానిక్గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇతనికి ముగ్గురు ఆడపిల్లలు, కుమారుడు మహ్మద్ షాబాద్ ఉన్నారు. రషీద్, అతని భార్య సమీనా బేగం, కొడుకు షాబాద్, కోడలు తబస్సుం బేగం కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలో రషీద్ మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ మద్యం తాగొచ్చి ఇంట్లో చిన్నచిన్న విషయాలకే భార్య, కొడుకును కొట్టేవాడు. మద్యానికి డబ్బులివ్వాలంటూ ఇబ్బందులకు గురి చేసేవాడు. దీంతో విసుగుచెందిన కొడుకు షాబాద్ తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 3న బాగా మద్యం తాగిన రషీద్.. ఓ బార్ వద్ద పడిపోయాడు. అప్పటికే తలకు బాగా గాయాలు కావడంతో ఓ వ్యక్తి అతన్ని ఇంటికి తీసుకొచ్చి వదిలేశాడు. మరుసటి రోజు మద్యం తాగేందుకు భార్యను డబ్బులు ఇవ్వాలని వేధించాడు. ఈ విషయమై ఇంట్లో వారు షాదాబ్కు ఫోన్ చేశారు. అతనువచ్చి చూసే సరికి రషీద్ భార్యను కొడుతున్నాడు.
కోపోద్రిక్తుడైన షాదాబ్.. తలపై కొట్టి చంపితే తాగి పడిపోవడంతో గాయాలై రషీద్ మరణించాడని చెబితే అందరూ నమ్ముతారని భావించాడు. తండ్రిని ఇంట్లోకి లాక్కెళ్లి పొయ్యిల కట్టెతో తలపై కొడుతూ, మర్మాంగంపై విచక్షణా రహితంగా తన్నడంతో రషీద్ మరణించాడు. కాగా.. రషీద్ మేనల్లుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాడు. అవయవాలను మెడికల్ పరీక్షలకు పంపగా.. కొట్టడం వల్లే మృతిచెందాడని రిపోర్టుల్లో తేలింది. ఈ క్రమంలో పోలీసులు షాదాబ్ను విచారించగా.. తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ఉన్నారు.