నార్నూర్, మే 5 : యాసంగి పంటల సాగు వలసకూలీలకు ఉపాధి చూపుతున్నది. నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలో ఏటా 12 వేల ఎకరాల్లో వర్షాధారిత పంటలు సాగు చేస్తుంటారు. యాసంగిలో రెండో పంటగా ఐదు వేల ఎకరాల్లో వివిధ రకాల సాగు ఉంటుంది. చెరువు, నీటికుంట, బోరుబావి, బావుల సౌకర్యం గల రైతులు సాగుపై దృష్టి పెడుతారు. ఈ యాసంగిలో 3వేల ఎకరాల్లో జొన్న, 500 ఎకరాల్లో గోధుమ, 750ఎకరాల్లో శనగ, 500 ఎకరాల్లో మినుము, పెసర, మక్క, నువ్వు, ఇతర పంటలు, 250 ఎకరాల్లో కూరగాయలు సాగు చేశారు. ప్రస్తుతం జొన్న పంట చేతికి వచ్చింది. కూలీల కొరత ఉండడంతో కెరమెరి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన కూలీలు మాన్కాపూర్ గ్రామానికి వలస వస్తున్నారు. రోజు వారీగా మహిళా కూలీకి రూ.300, పురుషులకు రూ.400 చెల్లిస్తున్నారు. దాదాపు 100 మంది కూలీలకు పని దొరుకుతున్నది. వేసవిలో తమ గ్రామాల్లో పనులు లేకపోవడంతోనే ఇక్కడి వచ్చిన్నట్లు కూలీలు చెబుతున్నారురు. పనులు దొరకడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మాది ఉట్నూర్ మండలం లక్కారాం గ్రామం. ఊరిలో కూలీ పని దొరకడం లేదు. పని చేసేందుకు వచ్చిన. రోజు వారీగా రూ.300 కూలీ ఇస్తున్నారు. వారం రోజుల నుంచి పని చేస్తున్న.
-కళావతి, వలసకూలీ, లక్కారాం
మా ఊళ్లో వ్యవసాయ పనులు ముగిశాయి. వేసవికాలం కావడంతో ఎలాంటి పనులు లేవు. లక్కారాం నుంచి పనికి వచ్చిన. రోజుకు రూ.400 కూలీ ఇస్తున్నరు. మరో వారం రోజుల పాటు పనులు చేసుకోవచ్చు.
-ఆత్రం జాలింశావ్, వలసకూలీ, లక్కారాం
ప్రతి ఏడాది రెండు పంటలు సాగు చేస్తాం. వానకాలం సాగు ముగిసింది. యాసంగిలో రెండు ఎకరాల్లో జొన్న సాగు చేస్తుంటాను. కొత సమయంలో కూలీల కోసం చాలా ఇబ్బంది పడేటోళ్లం. ఈ ఏడాది మాత్రం ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వస్తున్నారు. మహిళా కూలీకి రూ.300, పురుషులకు రూ.500 చెల్లిస్తున్నాం. ఈ యాసంగిలో కూలీల కొరత లేకుండా పోయింది. జొన్నపంట దిగుబడి కూడా బాగానే ఉంది.
-కోట్నాక్ పవన్కుమార్, రైతు, మాన్కాపూర్