‘తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటయి.. జనం ఆగం అవుతరు.. కరంటు ఉండక పంటలు పండవు.. దుకాణాలు వెలవెలబోతయి.. కరువు కాటకాలతో అల్లాడుతరు..” అన్న గత పాలకుల తప్పుడు కూతలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. ఇదీ నడి ఎండాకాలం. 46 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
భానుడు భగభగ మండుతుండడంతో మీటర్లు గిర్రున తిరుగున్నాయి. వేసవితాపం నుంచి ఉపశమనానికి జనం కూలర్లు, ఏసీలు విరివిగా వినియోగిస్తుండడంతో విద్యుత్ వినియోగం రికార్డుస్థాయికి చేరింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుకూ 7.50 మిలియన్ యూనిట్లు వినియోగం అవుతున్నది. ఇదే సమయంలో డజనుకుపైగా పొరుగు రాష్ర్టాలు కరంటు లేక విలవిలలాడుతున్నాయి.
పవర్హాలిడేలు కొనసాగిస్తున్నాయి. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మన తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మాత్రం రెప్పపాటు కూడా పోవడం లేదు. ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ ముందస్తు ప్రణాళికతో దేశం విద్యుత్ సంక్షోభంలో ఉన్నా.. మన తెలంగాణలో మాత్రం నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్నదని సబ్బండవర్గాలు పేర్కొంటున్నాయి.
ఆదిలాబాద్, మే 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లావాసులు తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. సమైక్య పాలకులు కరంట్ సరఫరాపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, డిమాండ్కు తగిన విధంగా ఉత్పత్తి చేయకపోవడం, ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేయకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. కనీసం గృహావసరాలకు కూడా అందించలేని దుస్థితి ఉండేది. వేసవికాలంలో అయితే కరంట్ లేక ప్రజలు నరకయాతన అనుభవించేవారు.
పంటలు ఎండిపోయేవి. కరంటు ఎప్పుడు ఉంటుందో? ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో రోజుల తరబడి కరంటు ఉండేది కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్పత్తిని పెంచడంతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసి నిరంతరంగా సరఫరా చేస్తున్నారు.
దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రెప్పపాటు కాలం కూడా పోవడం లేదు. డజనుకు పైగా పొరుగు రాష్ర్టాలు కరంటు లేక విలవిలలాడుతున్నాయి. మన పక్క రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ర్టాల్లో కరంటు కొరతతో సతమతం అవుతున్నాయి. మన తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మాత్రం క్షణం కూడా కరంటు పోవడం లేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నెల రోజులుగా ఎండల ప్రభావం అధికంగా ఉంటున్నది. పది రోజులుగా 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం రహదారులు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండవేడి నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వాడకం విపరీతంగా పెరిగింది. ప్రజలు అవసరాల మేరకు తెలంగాణ సర్కారు కరంటు సరఫరా చేస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో గృహా విద్యుత్ కనెక్షన్లు 1,75,438, నిర్మల్లో 2,26,069, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 1,39,750, మంచిర్యాలలో 3,14,000 కనెక్షన్లు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అన్ని కేటగిరీలకు కలిపి రోజు 1.30 మిలియన్ యూనిట్లు, నిర్మల్లో 2.32, మంచిర్యాలలో 2.90, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 0.98 మిలియన్ యూనిట్లు వినియోగం అవుతున్నది. ఉమ్మడి జిల్లాలో భారీస్థాయిలో విద్యుత్ డిమాండ్ ఉన్నా సీఎం కేసీఆర్ ఎలాంటి కోతల లేకుండా సరఫరా చేస్తున్నారు.
పగలు, రాత్రి తేడా లేకుండా డిమాండ్ మేరకు వినియోగదాకులకు మెరుగైన విద్యుత్ను అందిస్తున్నారు. గాలి, దూమారం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు ప్రమాదకరమైన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, వేలాడుతున్న తీగలను సరిచేశారు. ఎక్కడికక్కడ సమస్యలను గుర్తించి సరిచేశారు. దీంతో విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం ఎండాకాలంలో ఎలాంటి సమస్యలు లేకుండా కరంటు ఇవ్వడంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని కేటగిరీలకు సంబంధించిన వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. విద్యుత్ సబ్స్టేషన్లలో సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తూ ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తున్నారు. వేసవిలో ఎండల ప్రభావం కారణంగా గృహ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరంటు సరఫరా చేస్తున్నాం. వినియోగదారుల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించి మెరుగైన సేవలు అందిస్తున్నాం.
– ఉత్తం జాడే, సూపరింటెండెంట్ ఇంజినీర్, ఎన్పీడీసీఎల్, ఆదిలాబాద్
మా కాడ కరంట్ కటింగ్లు లేవు. 24 గంటలూ ఉంటున్నది. గీ ఎండ కాలంల కరంట్ లేకుంటే మస్తు తిప్పలయ్యేది. కూలర్లు పెట్టుకొని ఇండ్లల్ల ఉంటున్నం. లేకపోతే ఈ ఉక్కపోతకు కష్టమయ్యేది. మారుమూల పల్లెల్ల కూడా మంచి ఎండల్ల కరంటు ఉంటున్నదంటే ఇంతకన్న మంచి ఏముంటది. గిట్ల గతంల ఎప్పుడూ చూసింది లేదు. సీఎం కేసీఆర్ సారు చెయ్యవట్టే ఈ కరంటు ఉంటున్నది. తెలంగాణకు ఏది అవుసరమో.. ఆయనకు తెలిసినంత ఎవ్వరికీ తెల్వదు. కరంట్, నీళ్లు ఆయన పుణ్యమే.
-పైడి బాపయ్య, కుకుడ, ఆసిఫాబాద్ జిల్లా.
పక్కరాష్ట్రంల ఉంటలేదట..
ఈసారి సూరీడు సుర్రుమంటు న్నడు. బయటకు పోదమంటే భయమై తంది. గతంల గింత ఎండల సూసింది లేదు. అప్పుడు ఎండకాలమొచ్చిందంటే కరంట్ అస్సలు ఉండకపోయేది. ఒక్కోసారి పొద్దున పోతే ఏ రాత్రికో వస్తుండే. ఇప్పుడా ఇబ్బంది లేదు. సీఎం కేసీఆర్ పుణ్యామని పట్నాలల్ల,పల్లెల్ల కటింగులు లేనేలేవు. మాకు మహారాష్ట్రల సుట్టాలున్నరు. అల్లకయితే కరంటే ఉంటలేదట. ఉక్కపోతకు బతకలేకపోతున్నం అంటున్నరు. మాకైతే ఆ ఇబ్బందే లేదు. గిట్ల చేసుడు మా కేసీఆర్ సారుతోనే అయితదని మా సుట్టపోళ్లకు చెప్పిన.
– చిట్యాల రవీందర్ గౌడ్, భుక్తాపూర్, ఆదిలాబాద్
మునుపు గాలి వీచినా, చినకు పడినా కరెంట్ కట్టవు తుండే. ఇగ వస్తదో రాదో.. తెలియకపోతుండే. గంట లు.. ఉక్కపోత భరించలేక బయట తిరుగుతుంటిమి. ఇట్ల జాగరణలు చేసిన రోజులు ఎన్నో ఉన్నయ్. తెలంగాణ సర్కారు వచ్చినంక ఆ కష్టాలు తప్పినయ్. ఏ కాలమైనా 24 గంటలు ఫుల్లుగా ఉంటంది. గిప్పుడు కరంట్ ఉన్నది కాబట్టే ఈ నోటిఫికేషన్లకు పిల్లలు కూడా సదువగలుగతరు. లేకుంటే ఈ ఎండల్ల ఇబ్బందులు పడుతుండే.
– విశ్వ ,శాంతినగర్ ,ఆదిలాబాద్
గింత ఎండలు గతంలో ఎప్పుడూ సూడలె. ఈ ఏడాదైతే మరీ మండిపోతున్నయ్. ఎండల బయటకు పోవుడే బందయ్యింది. పొద్దుగాల్నే పనులన్నీ చేసుకుంట. అవసరముంటనే బయటకు పోతున్న. ఇంట్లో ఉంటే కూలర్ దగ్గరి నుంచి కదులుతలేను. కరెంటు పోతలేదు. లేకుంటే గతంల లెక్క కోతలు ఉంటే ఇగ బతుకుడే కష్టమయ్యేది. కోతలు లేకుండా సర్కారు మంచిగ కరంట్ ఇస్తున్నది. కరంట్ లేకుంటే పిల్లలు, పెద్దలు ఈ ఉక్కపోతను తట్టుకునుడు కష్టమయ్యేది.
-పెంటయ్య, బెజ్జూర్
మంచిర్యాల టౌన్, మే 3 : నేను మంచిర్యాలలో ప్రైవేట్గా ఉద్యోగం చేస్తున్న. వృత్తిరీత్యా ఫీల్డ్లో తిరుగుతుంట. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత కాసేపు ఏసీ కింద కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఇంతకముందు గవుర్నమెంట్ల కరెంటు కోతలే ఎక్కువగా ఉండేది. ఫ్యాన్ వేసుకుందామనుకున్నా వేళాపాలలేని కరంటు సరఫరాతో తిప్పలయ్యేది. ఎండ వేడి తట్టుకోలేక కూలర్ల ఎదురుగా ఉండాల్సి వస్తున్నది. ఎండాకాలం వచ్చిందంటే ఏసీనే ఎక్కువగా వాడుతున్నం. గిప్పుడయితే కరంటు పోతలేదు కాబట్టి ఇబ్బందయితలేదు. వేరే రాష్ర్టాల్లో, ముఖ్యంగా మన పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోనూ కరంటు కోతలు ఎక్కువనే ఉంటున్నయట. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ముందస్తు ప్రణాళికలతో కరెంటుకు తిప్పల తప్పింది. ఎంతయినా కేసీఆర్ సార్ సూపర్.
– జీ.మల్లికార్జున్, మంచిర్యాల.
గతంల వేసవి అచ్చిందంటే పగలు,రాత్రి కరెంటు ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతదో తెల్వకపోతుండే. ఇప్పుడా రంది లేదు. రాష్ట్రంల కరంట్ కోతల పరేషాన్లు లేవు. మాది ఉమ్మడి కుటుంబం. రెండు కూలర్లు, ఫ్యాన్లు ఫ్రిజ్ వాడుతం. గిప్పుడున్న ఎండలు గతంల ఎప్పుడూ లేవు. అయినా కరంట్ ఉండకపోతుండే. ఇప్పుడు పిల్లలంతా ఎండల బయటకు పోకుండా సల్లగ ఇంటికాడ్నే సేదతీరుతున్నరు. ఆంధ్రా జమాన్ల అస్సలు కరంట్ ఉండకపోతుండే. సీఎం కేసీఆర్ సారు ముందుగాల్నే చెప్పిండ్రు. తెలంగాణొస్తే కరంట్ ఫుల్లుంటదని. ఇప్పుడు కనిపిస్తున్నదని కదా..
– రెడ్డి రమేశ్ యాదవ్, కరంజి(టి), భీంపూర్
మాకు నిరంతరంగా విద్యుత్ సరఫరా అవుతున్నది. మన పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్, గుజరాత్ వంటి రాష్ర్టాల్లో పవర్హాలీడేలు ప్రకటిస్తున్నారు. మన వద్ద నిరంతరంగా కరంటు ఉంటున్నది. ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్లడానికి వీలులేదు. అయినా మన వద్ద కరంటు పోవడం లేదు. ఏసీలు, కూలర్ల కింద హాయిగా సేదతీరుతున్నం. ఇదంతా కూడా సీఎం కేసీఆర్ ముందస్తు ప్రణాళికతో చేయడంతోనే సాధ్యమైంది.
– సుభాష్, కిరాణ వ్యాపారి, ఖానాపూర్
కరంట్ లేకుంటే కష్టమయ్యేది..
ఈ ఏడాది ఎండలు మండుతున్నయ్. మాడు పగులుతాంది. ఉదయం తొమ్మిది దాటిందంటే బయటకు వెళ్లాలంటే ఇగ భయమైతాంది. గింత ఎండలను ఎప్పుడూ సూడలె. ఇప్పుడు గనుక కరంట్ లేకుంటే మస్తు ఇబ్బందయ్యేది. సీఎం కేసీఆర్ 24 గంటల కరంట్ ఇచ్చి మమ్మల్ని బతికిచ్చిండు. లేకుంటే మస్తు తిప్పలయ్యేది. కూలర్లు నడస్తనే కొద్దిగ చల్లగ ఉంటంది. లేకుంటే ఈ ఉక్కపోతకు ఎట్లుందుమో.. ఎండాకాలంలో కూడా ప్రభుత్వం 24 గంటల కరంట్ ఇచ్చుడు మొదటిసారి చూస్తున్న. గిట్ల గతంలో ఏ ఒక్కలూ ఇయ్యలే.
-దుర్గం పాపక్క, కుకుడ